వైసీపీ కేడ‌ర్ అయినా మిగులుతుందా?

ఏ పార్టీకైనా.. నాయ‌కులతో పాటు కేడ‌ర్ అత్యంత కీల‌కం. జెండాలు మోసేదీ.. జేజేలు కొట్టేదీ కూడా వారే. అందుకే.. అన్నిపార్టీలూ కేడ‌ర్‌ను దృష్టిలో పెట్టుకుని స‌భ్య‌త్వానికి శ్రీకారం చుడుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. టీడీపీ అయినా.. జ‌న‌సేన అయినా.. కేడ‌ర్ వైపు ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్నాయి. నాయ‌కులు త‌యార‌వుతారు. కానీ, కేడ‌ర్ పోతే మాత్రం క‌ష్టం అనే భావ‌న పార్టీల్లో ఉంది. నాయ‌కుల‌ను అనుస‌రించే కేడ‌ర్ కొంత ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా పార్టీకి అంకిత భావంతో ప‌నిచేసే కేడ‌ర్ కూడా ఉంటుంది.

ఈ విష‌యంలో వైసీపీ ఇప్పుడు కేంద్రంగా మారింది. కేడ‌ర్‌ను కాకుండా.. వ‌లంటీర్ల‌ను న‌మ్ముకున్న ఫ‌లితంగా జ‌గ‌న్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అన్నీ వ‌లంటీర్ల‌కే ఇచ్చారు. వ‌లంటీర్ల‌తోనే చేయించారు. దీంతో కేడ‌ర్ తీవ్రంగా దెబ్బ‌తింది. ఇది ఎన్నికల స‌మ‌యంలో క‌నిపించింది. ఇక‌, వ‌లంటీర్లు వేత‌నం కోసం ప‌నిచేశారే.. త‌ప్ప పార్టీ కోసం కాద‌ని కూడా ఎన్నికల ‌వేళ తేలిపోయింది.

రూ.5000 కాదు.. రూ.10 వేలు ఇస్తామ‌న్న టీడీపీ కూట‌మికి అనుకూలంగా ప‌నిచేశార‌ని జ‌గ‌నే చెప్పారు. దీంతో అటు కేడ‌ర్‌, ఇటు వ‌లంటీర్లు కూడా వైసీపీకి హ్యాండిచ్చారు. ఇది ముగిసిన క‌థ‌. అయితే.. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి కేడ‌ర్ అయినా.. మిగులుతుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. నాయ‌కులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. కానీ అవ‌కాశ‌మే లేకుండా పోయింది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెడీ అవుతున్నాయి.

నాయ‌కులు క‌నుక రేపు ఈ రెండు పార్టీల్లోకి వెళ్లిపోతే.. కేడ‌ర్ కూడా వారిని అనుస‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీంతో మొత్తానికి కేడ‌ర్ అంతా కూడా.. క‌కావిక‌లం కావ‌డం ఖాయం. పోనీ.. పార్టీనే న‌మ్ముకున్న కేడ‌ర్ ఉందా? అంటే.. 2020 వ‌ర‌కు ఉంది. త‌ర్వాత‌.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కార‌ణంతో వారంతా పార్టీకి దూరంగా ఉన్నారు. అందుకే.. ఇప్పుడు జిల్లాల స్థాయిలో వైసీపీ మాట వినిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఉన్న నాయ‌కుల‌తోపాటు కేడ‌ర్ కూడా వెళ్లిపోతే.. పూర్తిగా వైసీపీకి కేడ‌ర్‌లేని పరిస్థితి వ‌స్తుంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.