జగన్ కామెంట్… కరోనాతో కలిసి సహజీవనం తప్పదేమో

ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోతుంటే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కాస్తంత నింపాదిగానే కనిపించారన్న మాట వినిపించింది. అసలు కరోనా అంత డేంజరేమీ కాదన్నట్లుగా వ్యవహరించిన జగన్ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయని ఇతర పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి తరుణంలో కరోనా విస్తరణ, భవిష్యత్తులో ఆ వైరస్ తో కలిసి సహజీవనం చేయక తప్పదేమోనంటూ జగన్ నోట ఆసక్తికర కామెంట్లు వినిపించడం చూస్తుంటే.. కరోనాపై జగన్ కు తత్వం బోధపడిందా? అన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి, ఆ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలపై మీడియాతో మాట్లాడేందుకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాను పూర్తిగా తరిమేయడం సాధ్యం కాదేమోనన్న భావనను వ్యక్తం చేసిన జగన్… మున్ముందు మనమంతా కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సి రావొచ్చేమోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా అంటరానితనం కాదని పేర్కొన్న జగన్… ఇళ్లలో వయసు పైబడిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ సూచించారు.

ఇక కరోనా వ్యాప్తిపై మాట్లాడిన జగన్… 10 లక్షల జనాభాకి ఏపీలో 1396 టెస్టులు చేశామని.. దేశం మొత్తం యావరేజ్ 400 మాత్రమేనని.. ఈ విషయంలో దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, కరోనా కోసమే రాష్ట్రంలో 5 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటివరకు 74551 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ..రాష్ట్రంలో కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్స్ లో ఉన్నాయని.. అలాగే 54 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి.. మిగిలిన 559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన రాష్ట్రంలో 80 శాతం మండలాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైందని.. ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉపవాస దీక్షలు చెప్పట్టాలని… ప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని మసలుకోవాలని కూడా జగన్ విజ్ఝప్తి చేశారు.