అమ‌రావ‌తి కొన‌సాగి ఉంటే.. 3 ల‌క్ష‌ల కోట్ల ఆస్తి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అడ్డంగా నిలిపివేశార‌ని.. అస‌లు రాజ‌ధానిని లేకుండా చేయాల‌ని కూడా కుట్ర‌లు చేశార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. కానీ, భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌ధాని నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలిపారు. రాజ‌ధాని నిర్మాణం కొన‌సాగి ఉంటే.. ఇప్ప‌టికే అది 3 ల‌క్ష‌ల కోట్ల ఆదాయాన్ని ఇచ్చి ఉండేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అసెంబ్లీ ఆర్థిక శ్వేత‌ప‌త్రంపై మాట్లాడుతూ.. రాజ‌ధాని గురించి ప్ర‌స్తావించారు. దీనిని నిలిపివేసి పెద్ద త‌ప్పు చేశార‌ని అన్నారు.

వ‌చ్చే మూడేళ్ల‌లోనే అమ‌రావ‌తిని న్యూ ఎపిక్ సెంట‌ర్ ద్వారా అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వైపు(ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని… అమ‌రావ‌తి కూడా.. ఏఐకి కేంద్రంగా మారుతుంద‌ని.. ఆ దిశ‌గా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. గ‌త ఐదేళ్ల కాలంలో అమ‌రావ‌తి నిర్మాణం ముందుకు సాగి ఉంటే.. ప్ర‌భుత్వానికి 3 ల‌క్ష‌ల కోట్ల ఆస్తి వ‌చ్చి ఉండేద‌న్నారు. అదేస‌మ‌యంలో 7 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు, అంత‌కు మూడింత‌ల మందికి ఉపాధి ల‌భించేద‌ని వివ‌రించారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ళ్లీ వైభ‌వం తీసుకురానున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే ప‌క్కా వ్యూహం రెడీ చేసుకున్నామ‌ని.. మంత్రి నారాయ‌ణ ఆ ప‌నిపైనే ఉన్నార‌ని వివ‌రించారు. వ‌చ్చే మూడేళ్ల‌లోనే ఒక రూపు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపారు. త‌మ హ‌యాంలో వ్య‌వ‌సాయం అభివృద్ధి చెందింద‌ని.. సేవ‌ల రంగంలోనూ దూసుకుపోయామ‌ని చెప్పారు.

కానీ, వైసీపీ హ‌యాంలో ఈ రెండు రంగాల‌ను నాశ‌నం చేశార‌ని వివ‌రించారు. దీంతో జీఎస్‌డీపీ కంట్రిబ్యూషన్‌ రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందని తెలిపారు. అదేవిధంగా ఆదాయం కూడా రూ.76,195 కోట్లు తగ్గిపోయింద‌ని వివ‌రించారు. దీనిని సెట్ రైట్ చేసేందుకు తాము రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేయాల్సి ఉంద‌ని తెలిపారు. దీనిలో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఉంటుంద‌ని.. అంద‌రూ స‌మ‌ష్టిగా కృషి చేయాల్సి ఉంద‌న్నారు.