జగన్ అరాచక పాలనపై చంద్రబాబు శ్వేతపత్రం

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు…తాజాగా సభలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా మనోవేదన అనుభవించారని విమర్శించారు.

పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని అన్నారు. గతం ప్రభుత్వంలో వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు వీఆర్ లోనే కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారంటూ ఏబీవీ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని అన్నారు.

గతంలో తనపై బాబ్లీ కేసు ఒక్కటే ఉండేదని, జగన్ పాలనలో తనపై 17 కేసులు, పవన్ కల్యాణ్ పై 7 కేసులు పెట్టారని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, ప్రతిపక్ష నేతలను అణచివేశారని ఆరోపించారు. సంగం డెయిరీలో అక్రమాలంటూ ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారని, పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని జైల్లో పెట్టారని మండిపడ్డారు.

ఫర్నిచర్ తీసుకువెళ్లారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవమానంగా భావించిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని భావోద్వేగానికి గురయ్యారు. గత ప్రభుత్వంలోని ఫర్నిచర్ జగన్ ఇంట్లో లేదా అని ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజును లాకప్ లో పెట్టి దారుణంగా చిత్రహింసల పాల్జేశారని, ఆ వీడియో చూసి అప్పటి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం అమరావతి రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదని, కేసులు, అరెస్ట్ లే కాదు, కనీసం తిండి కూడా తిననివ్వకుండా చేసిన చరిత్ర నాటి ప్రభుత్వానిదని మండిపడ్డారు.

వివేకా హత్య జరిగితే..గుండెపోటు అని, ఆ తర్వాత హత్య అఅని అన్నారని, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వెళితే అడ్డుకున్నారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయ చరిత్రలో జగన్ వంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. జగన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హుడని, అటువంటి వ్యక్తి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో తనకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నానని, ప్రాణసమానులైన కార్యకర్తలను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపుల కోసం కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్చ చేపడతామని అన్నారు.