జగన్ ఇప్పుడిలా.. మరి రేపు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీ కార్యకర్తలు, నేతల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

ఐతే కూటమిలో జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే అయినప్పటికీ.. ఆ పార్టీల పేర్లు పెద్దగా ప్రస్తావించలేదు. ప్రధానంగా తెలుగుదేశం, చంద్రబాబునే ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఐతే తెలుగుదేశం ఎన్డీయేలో భాగస్వామి కావడంతో ఆయన కొంతమేర ఎన్డీయే వ్యతిరేక.. ఇండియా కూటమిలో భాగస్వాములైన కొన్ని పార్టీల దృష్టిని ఆకర్షించగలిగారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కొందరు నేతలు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు పలికారు. నిరసన అనంతరం జగన్.. ఆయా పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ కూడా వేశారు.

ఐతే ఈ నిరసన కార్యక్రమంతో ఒక రకంగా జగన్ ఎన్డీయే కూటమి వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు. టీడీపీని వ్యతిరేకిస్తున్నాడు అంటే బీజేపీ నేతృత్వంలోని కూటమికి జగన్ వ్యతిరేకి అనే భావనతోనే కొందరు ఇండియా కూటమి నేతలు జగన్‌కు మద్దతు పలికి ఉండొచ్చు. మరి జగన్ రేప్పొద్దున ప్రధాని నరేంద్ర మోడీతో, అలాగే ఎన్డీయే ప్రభుత్వంతో ఎలా వ్యవహరిస్తాడు అన్నది ఆసక్తికరం.

ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం అయితే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లే భావించాలి. తన పార్టీకి లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న బలంతో ఆయన పార్లమెంటులో ఏవైనా బిల్లులు వచ్చినపుడు వ్యతిరేకంగా ఓటు వేయించాలి. అలాగే ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టాలి. అప్పుడు ఇండియా కూటమి నేతలు మరింతగా జగన్‌ను ఓన్ చేసుకుంటారని భావించవచ్చు. కానీ బీజేపీ కూడా భాగస్వామి అయిన ఏపీ ప్రభుత్వాన్ని తిడుతూ.. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే జగన్ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బ తింటుంది. మరి రేప్పొద్దున జగన్ ఏం చేస్తాడో చూడాలి.