ఢిల్లీ ధ‌ర్నా: జ‌గ‌న్‌కు ఒరిగేదేంటి.. ?

ఢిల్లీలో ధర్నా చేస్తున్న వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డికి ఒరిగే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఎందుకంటే ఢిల్లీలో ధర్నా చేయడం తప్పు కాదు. గతంలో చంద్రబాబు కూడా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ధర్నా చేయటం తెలిసిందే. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత అత్యవసరమైన అవకాశం, అవసరం ఏమొచ్చింది? అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి ధర్నా చేయాలి అనుకుంటే విజయవాడలో చేయొచ్చు. లేదా అసెంబ్లీ ముందు చేయొచ్చు. లేదా తను ఏ ఉద్దేశంతో అయితే ధర్నా చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో వెళ్లి ధర్నా చేస్తే బాగుండేది.

దీన్ని వదిలేసి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయటం.. దీన్ని జాతీయ పత్రికల్లో మీడియాలోనూ ప్రధానంగా వచ్చేలాగా వ్యవహత్మకంగా వ్యవహరించడం వంటివి చూస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని బ‌ద్నాం చేయాలన్న‌ ఏకైక ఉద్దేశం తప్ప మరొకటి కనిపించడం లేదు. కానీ వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు మాత్రమే అయింది. ఇంత స్వ‌ల్ప కాలంలో ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత అయితే రాదు. వచ్చినా అది తాత్కాలికంగానే ఉంటుంది.. తప్ప.. నిర్దిష్టంగా అయితే నిలబ‌డ‌దు. పైగా 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు పడిపోయిన వైసిపి ఆత్మవిమ‌ర్శ‌ చేసుకోకుండా ఇలా యాగి చేయటం వల్ల ఆ పార్టీకే పరువు నష్టం అనే మాట వినిపిస్తోంది.

ముందుగా క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసిపోవడం, వారి సమస్యలను తెలుసుకోవడం వారి కష్టాలను పంచుకోవడం ద్వారా మాత్రమే వైసిపి సానుభూతి సంపాదించుకుంటుంది. తప్ప ఇలా ఢిల్లీలో ధర్నాలు చేయడం ద్వారా ప్రయోజనం అయితే ఉండదని, ఎవరూ పట్టించుకోరని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్ని వైసిపి అధినేత జగన్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలు అకాల వర్షాలతో అనేకమంది ఇళ్లు, పంట పొలాలు మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇప్పటివరకు ప్రభుత్వం మంచి ఒక రూపాయి కూడా అందలేదు.

అంతేకాదు.. బాధిత ప్రాంతాల్లో మంత్రులు తిరుగుత‌న్నా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేద‌ని బాధితులే చెబుతున్నారు. ఇలాంటి వాటిపై జగన్ దృష్టి పెట్టి గతంలో తానే ఏం చేశానో.. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తే ఆయనకు సానుభూతి పెరుగుతుంది. అలా కాకుండా కేవలం చంద్రబాబును టార్గెట్ చేసుకొని ఢిల్లీలో ఉద్యమాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనము వొన‌గూరే ది లేదని పరిశీలకులు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ మాత్రం ధ‌ర్నా కోస‌మే ఉవ్విళ్లూరారు. ఏం జ‌రుగుతుందో.. ఏం సాధిస్తారో చూడాలి.