హిందుత్వ అజెండాలో ఆహార నియమాలు.. !

హిందుత్వ అజెండాలో ఆహార నియమాలు. ఇది వినేందుకే ఇబ్బందిగా అనిపించే పరిణామం. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం దీనిని ప్రధాన అజెండాగా బిజెపి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈనెలలో ప్రారంభమయ్యే శ్రావణమాసం సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కావ‌డి ఉత్సవాన్ని హిందువులు ఘనంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల్లోని వారు గంగానది జలాలను తీసుకువెళ్లి శివాలయాల్లో అభిషేకం చేస్తారు. దీనిని కావ‌డి ఉత్స‌వంగా పేర్కొంటారు. ఈ ఉత్సవం జరిగే సమయాల్లో ఆహార నియమాలను అనుసరించాలి అనేది బిజెపి పాలిత రాష్ట్రాలు పెట్టుకున్న సరికొత్త నియమం.

కానీ రాజ్యాంగం ప్రకారం వ్యక్తులపై ఆహార నియమాలు రుద్దడం అనేది ఎక్కడా లేదు. దీని రాజ్యాంగం కూడా అంగీకరించదు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంత విలువ ఇచ్చిందో అదే విధంగా వ్యక్తుల ఆహార నియమాలకు కూడా రాజ్యాంగం అంతే అవకాశం కల్పించింది. తమకి ఇష్టమైన దుస్తులను ధరించడం తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవటం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే దీనిని కూడా బిజెపి హిందూ అజెండాకు ముడిపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్న వైనం ఇప్పుడు వివాదాలకు దారితీసింది.

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరోక్షంగా దీనిని అమలు చేయాలని బిజెపి పెట్టుకున్న లక్ష్యంగా కనిపిస్తోంది. కావ‌డి ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో హోటల్ లో యజమానులు తమ పేర్లు, తమ కులాలు, తమ మతాలను స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇది పెను సంక్షోభానికి దారి తీసింది. ఉదాహరణకు ఎవరైనా ముస్లిం హోటల్ నిర్వహిస్తుంటే దానిని తెలుసుకుని తద్వారా దాన్ని తొల‌గించాలి అనే ఒక ఎత్తుగడ ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఎట్టకేలకు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు యజమానుల పేర్లను కాకుండా వారు వండి వడ్డించే ఆహార పదార్థాలు మాత్రమే బహిరంగం చేయాలని పేర్కొనడం ద్వారా కొంతమేరకు ఉపశమనం కలిగించినా అసలు హిందూత్వ అజెండాను అమలు చేయాలన్న ప్రభుత్వాల ఉద్దేశాన్ని మాత్రం క‌ట్ట‌డి చేయలేకపోయిందనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఈ దేశంలో ప్రజలు కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా కూడా ఆహార నియమాలను పాటించలేదు.

ఎవరికి నచ్చిన ఆహారం వారు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఈ వివాదం తెర మీదకు వచ్చింది? దీని నుంచి ఆయా రాష్ట్రాలను కాపాడే పరిస్థితి లేకపోవడం ఉద్దేశపూర్వకంగా మత ప్రాతిపదికన హోటళ్లను నిర్దేశించడం వంటి అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మునుముందు ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పటికైతే సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదానికి కొంత మేరకు ఉపశమనం లభించింది.