వైసీపీ వేధింపులు.. ఎంపీడీఓ బలి

వైసీపీ వేధింపులకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీడీఓ బలయ్యాడు. వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్ ప్రసాదరాజు నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి కాంట్రాక్టర్‌ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని, ప్రసాదరాజు అండదండలతోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖను కుటుంబసభ్యులకు పంపించడం గమనార్హం.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకట రమణరావు విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. జులై 3వ తేదీ నుంచి విధులకు సెలవు పెట్టిన ఆయన కానూరులోని తన ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.

రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని ఇంటికి రావడానికి లేటవుతుందని తెలిపాడు. ‘నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్‌ చేశాడు.

ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్, సీసీ విజువల్స్ ఆధారంగా ఇన్ని రోజులు గాలింపు జరపగా తాజాగా ఆయన మృతదేహం లభ్యమైంది.