బొత్స ఢీలా.. అల్లుడి జోరు

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, ఆ త‌ర్వాత‌ ఏపీలో త‌న‌దైన పొలిటిక‌ల్ ప్ర‌యాణాన్ని ఆయ‌న కొన‌సాగించారు. మొద‌ట కాంగ్రెస్‌లో, ఆ త‌ర్వాత వైసీపీలో కీల‌క పాత్ర పోషించారు. వివిధ శాఖ‌ల‌కు మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లూ చేప‌ట్టారు. కానీ ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ సీనియ‌ర్ నాయ‌కుడు ఢీలా ప‌డ్డారు. చీపురుప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థి కిమిడి క‌ళావెంక‌ట రావు చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మితో విజ‌యన‌గ‌రంపై మంచి ప‌ట్టున్న బొత్స సైలెంట్ అయిపోయారు. దీంతో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీని న‌డిపించేది ఎవ‌ర‌నే ప్ర‌శ్న రేకెత్తుతోంది. ఇందుకు స‌మాధానంగా బొత్స మేన‌ళ్లుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు పేరు వినిపిస్తోంద‌ని టాక్‌. ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యంతో నిరాశ‌లో కూరుకుపోయిన మేన‌మామ బొత్స స్థానాన్ని భ‌ర్తీ చేసేలా శ్రీనివాస‌రావు సాగుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాజ‌కీయాల్లో విజ‌య‌నగ‌రం అంటే బొత్స పేరు మొద‌ట గుర్తుకొస్తోంది. కానీ ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్నాయి. శ్రీనివాస‌రావు నెమ్మ‌దిగా ఎదుగుతున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌గా ఉన్న శ్రీనివాస‌రావే.. వైసీసీ జిల్లా అధ్య‌క్షుడిగానూ కొన‌సాగుతున్నారు. జిల్లాలో ఆయ‌నే పార్టీని న‌డిపిస్తున్నారు. విజ‌య‌న‌గ‌రంలో బొత్స వార‌సుడిగా పేరు తెచ్చుకున్నారు. భ‌విష్య‌త్లో అక్క‌డ వైసీపీకి శ్రీనివాస‌రావు కీల‌కంగా మార‌తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీలో బ‌లం పెంచుకుంటూ శ్రీనివాస‌రావు విజ‌య‌న‌గ‌రంలో వైసీపీకి ప్ర‌ధాన శ‌క్తిగా ఎదిగే అవ‌కాశ‌ముంద‌ని టాక్‌.