ఏడాదికి 25 వేల కోట్లు.. ఇదీ సంప‌ద సృష్టి!

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా సంప‌ద సృష్టిస్తాం.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తాం.. అని చెప్పిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ప్ర‌క‌టించిన ‘సూప‌ర్ 6’ ప‌థ‌కాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయా ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే.. ఆర్బీఐనే ఏపీలో ఏర్పాటు చేయాలంటూ.. వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు. మ‌రికొంద‌రు ఇలాంటివ‌న్నీ.. తూచ్‌! అని వ్యాఖ్యానించారు. అయితే.. చంద్ర‌బాబు స‌ర్కారు ఇప్పుడు.. సూప‌ర్ 6 ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో రాష్ట్రానికి వ‌స్తున్న ఆదాయం ఎంత‌? పోతున్న ఆదాయం ఎంత‌? అనే లెక్క‌ల‌పై భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. దీని ప్ర‌కారం.. ఏటా 25 వేల కోట్ల మేర‌కు లోటు బ‌డ్జెట్ ఉంటుంద‌ని ఆర్థిక శాఖ అధికారులు లెక్క‌లు తేల్చారు. దీనిలోనూ.. ఏటా 50 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేయాల్సి ఉంటుంద‌ని.. అలా చేయ‌గా.. కూడా.. మ‌రో 25 వేల కోట్ల రూపాయ‌లు లోటు క‌నిపిస్తున్న‌ట్టు లెక్క‌లు వేశారు. వ‌చ్చే ఆదాయంలో ప్ర‌ధానంగా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు, ఉద్యోగుల‌కు వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పింఛ‌న్లు పోతాయని చెప్పారు.

ఇవి పోగా.. స‌ర్కారు అమ‌లు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు భారీ ఎత్తున నిధులు వెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. గ‌తంలో ఏటా 70 వేల కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమానికి వెచ్చించిన విష‌యాన్ని కూడా సీఎం చంద్ర‌బాబుకు ఇచ్చిన నివేదిక‌లో పేర్కొన్నారు. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి .. సంక్షేమ కార్య‌క్ర‌మాలు పెరిగిన నేప‌థ్యంలో ఇది సుమారు 90 వేల కోట్లకు చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. దీనిని బ‌ట్టి.. అప్పులు చేసినా.. లోటు పూడ్చుకునేందుకు మ‌రో 25 వేల కోట్ల వ‌ర‌కు అవ‌స‌రం ఉంద‌ని తేల్చారు.

దీంతో ఈ 25 వేల కోట్ల సంప‌ద‌ను సృష్టించ‌డంపై చంద్ర‌బాబు ప్రాధ‌మికంగా ఉన్న మార్గాల‌ను అన్వేషించాల‌ని ఆర్థిక శాఖ అధికారుల‌కు సూచించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా.. రిజిస్ట్రేష‌న్లు జ‌రిగి.. రెవెన్యూ ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా, ఐర‌న్‌, సిమెంట్‌, ఇత‌ర వ్యాపారాల ద్వారా.. ప‌న్నుల రూపంలో స‌ర్కారుకు కొంత మేర‌కు ఆదాయం పెరుగుతుంద‌ని ఒక అంచ‌నాకు వ‌చ్చారు. అలానే ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను ప్రోత్సహిస్తే.. సంప‌ద సృష్టి పెరుగుతుంద‌ని కూడా.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.