చంద్రబాబుది పెద్ద ప్లానే !

ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వానికి వెన్నెముకలా మారాడు. ఈ నేఫథ్యంలో ఈ ఐదేళ్లలో కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు, ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పరిశ్రమలు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రానికి అనేక వినతులు వెళ్లడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాలలో ఆ ఫైళ్లు ముందుకు సాగడం వాటిని ఆమోదింపచేసుకోవడమే అసలైన సమస్య. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య రాయబారులుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు 16 మంధి ఎంపీలకు వివిధ శాఖలను అప్పగించి ఆయా శాఖల ఫైళ్లను క్లియర్ చేయించుకుని తీసుకురావాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 22 నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఎంపీలకు శాఖలను అప్పజెప్పనున్నట్లు తెలుస్తుంది.

ఈ మేరకు పార్టీ ఎంపీలను తీసుకువెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇప్పించి ఆ ఫైళ్లను క్లియరెన్స్ చేయించే బాధ్యతను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీక్రిష్ణ దేవరాయలకు అప్పగించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, రాజకీయ, పార్లమెంటరీ వ్యవహారలలో కీలక సభ్యుడిగా ఆయన అందరు మంత్రులతో సన్నిహితంగా ఉండి కీలక ఫైళ్లను క్లియర్ చేయించే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది.

ఎన్డీఎలో టీడీపీ ప్రస్తుతం కీలక భాగస్వామి. టీడీపీ తరపున గెలిచిన వారిలో అనేక మంది విద్యాధికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో టీడీపీకి చెందిన వారికి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. వీరంతా ఆ బాధ్యతలు చేపట్టాక ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సాన్నిహిత్యం పెంచుకుని ఏపీకి సంబంధించిన వాటిని సాధించుకుని రావాలని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తుంది.