నన్ను ఇన్ వాల్వ్ చేయకండి జగన్ గారు !

వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు ఏపీలో ఐదేళ్లు 151 శాసనసభ్యులు, 21 ఎంపీలతో చక్రం తిప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు పరిమితమై చతికిలపడింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరి కొంతమంది అసలు ఎక్కడు ఉన్నారో ఆచూకీ లభించడం లేదు. ఇంకొందరిని పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించడం లేదు.

గత వైసీపీ హయాంలో విశాఖపట్నం స్థానిక సంస్థల శాసనమండలి స్థానం నుండి వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకుని విశాఖ దక్షిణ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీంతో అనివార్యంగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రానున్నది. ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 725 మంది వరకు ఉండగా, టీడీపీకి కేవలం 180 ఓట్లున్నాయి. వైసీపీకి 545 ఓట్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్సీ కావాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఆర్థికంగా శక్తిమంతుడు అయిన ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు తాడేపల్లిలో జగన్ ను కలిసిన ఎంవీవీ సత్యనారాయణ తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. తన సంస్థ చేపట్టిన వివిధ పనులను నిలిపివేయాలని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, ఈ మేరకు తన మీద, తన మనుషుల మీద కేసులు కూడా నమోదు చేశారని, ఈ పరిస్థితులలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది. 545 మంది సభ్యుల బలం ఉండి అక్కడ పోటీకి భయపడడం ఆశ్చర్యకరమే. ఈ స్థానం నుండి టీడీపీ గండి బాబ్జీని రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.