వైసీపీని బీజేపీ ఉంచుకుంది: షర్మిల

ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తొత్తుగా, తోక పార్టీగా, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ అని, బీజేపీకి జగన్ ఊడిగం చేస్తున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఊడిగం చేయడమే కాకుండా…మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో కూడా బీజేపీకి జగన్ మద్దతిచ్చారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటన సహా ఏది చూసుకున్నా మొత్తం బీజేపీతో జగన్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ప్రజలు గొయ్యి తీసి పాతిపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధం లేదు అని షర్మిల అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని గొప్పగా చేయకుండా ఏదో మొక్కుబడిగా చేశారని షర్మిల విమర్శించారు. 5 నిమిషాలు అక్కడ నిలబడే రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రంలా జగన్ నివాళులు అర్పించడాన్ని తప్పుబట్టారు. ‘సిద్ధం’ అంటూ పెద్ద పెద్ద సభలు, హోర్డింగ్ లు పెట్టి సభకు రూ.30 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభ ఎందుకు పెట్టలేకపోయారని జగన్ ను షర్మిల నిలదీశారు.

నా తండ్రి, మా పార్టీ నేత కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆ సభకు ఓ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలోని మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు రాజశేఖర్ రెడ్డి జయంతి కోసం సందేశాలు పంపించారని అన్నారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి అని అన్నారు.