వారసత్వ పోరులో షర్మిల ముందంజ…!

వారసత్వ పోరులో షర్మిల ముందంజలో ఉన్నారా? వైయస్ 75వ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందారా? రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం.. వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించినా.. ఇప్పుడు వ‌దిలేశారు. గ‌త ఐదేళ్ల‌లో రైతు దినోత్సవంగా పేరు పెట్టుకున్నారు.

రాష్ట్రస్థాయిలో రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అవార్డులు కూడా అందించారు. కానీ అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆయన ఈ జయంతిని ఇడుపులపాయకు, సమాధికి మాత్రమే పరిమితం చేశారు. కానీ తాను అధికారంలో లేకపోయినా, ఓటు బ్యాంకు లేకపోయినా వైయస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా షర్మిల కీలకమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు కూడా. పదవులు అధికారంతోనే వైయస్ గుర్తుండడు.. పదవులు అధికారం లేకపోయినా వైఎస్సార్ ని మేము గుర్తుపెట్టుకుంటాం.. వైయస్సార్ వారసత్వం మాదే అని చెప్పాలి అనుకున్నారు. చెప్పారు. చెప్పించారు.

అటు జాతీయస్థాయిలో రాహుల్ గాంధీని పరిశీలించినా, రాష్ట్రాల స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిశీలించినా ఇదే మాట చెప్పారు. రాహుల్ గాంధీ సెల్ఫీ వీడియోలో వైయస్ వారసురాలు షర్మిల మాత్రమే అని వ్యాఖ్యానించగా రేవంత్ రెడ్డి జయంతి సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైయస్సార్ నిజమైన వారసురాలు షర్మిలేనని చెప్పుకొచ్చారు. తద్వారా వైయస్సార్ వారసత్వం విషయంలో షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టం అవుతుంది.

అయితే దీని ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించరా? అనేది ఎన్నికల సమయంలోనే తెలుస్తుంది. ఎప్పటికి ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఒక చర్చ‌ అయితే తెర‌మీదికి రావడం ద్వారా ప్రజల మనోభావాలను కూడా ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా ఉంది. గత ఎన్నికలను పరిశీలిస్తే.. తను మంచి చేశాను, అంతా మంచే జరిగింది, ప్రజలు నా వెంట ఉన్నారు.. అని జగన్మోహన్ రెడ్డి ఊహించుకున్నారు. కానీ 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. మిగిలిన 10% మంది తటస్థ ఓట‌ర్లు టిడిపి వైపు అనుకూలంగా మారారు.

ఇప్పుడు కూడా వైయస్ వారసత్వం నాదే, నేను వైయస్ కు వారసుడిని అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి పార్టీ అని జనాలు భావిస్తున్నారు అని ఆయన భావించొచ్చు. కానీ, ఈ ప్రభావం రాను రాను తగ్గేటటువంటి అవకాశాలు తాజాగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. షర్మిల అటు జాతీయస్థాయిలో ఇటు రాష్ట్రాల స్థాయిలో కూడా వైయస్ వారసత్వాన్ని తనవైపు మలుచుకునే దిశగా కీలక నాయకుల నోటి నుంచి చెప్పించ గలిగారంటే రేపు సాధారణ ప్రజలతో కూడా చెప్పించేటటువంటి పరిస్థితికి ఆవిడ రావచ్చు.

దీనిని ముందుగా అంచనా వేసుకుంటే తప్ప వారసత్వం విషయంలో కీలకమైన ఓటు బ్యాంకు విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పులు లేకుండా వ్యవహరిస్తే తప్ప పార్టీకి మనుగ‌డ ఉండదనేది వాస్తవం. మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారా లేక అంతా బాగానే ఉంది అందరూ నా వైపు ఉన్నారు వారసత్వం నాదే అని చేతులు కట్టుకుని కూర్చుంటారా? అనేది చూడాలి.