సామజవరగమన సుందరికి సూపర్ ఛాన్స్

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ రెబ మోనికా జాన్ అందంతో పాటు అభినయం పరంగానూ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ శ్రీవిష్ణుతోనే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో భాగం పంచుకుంటోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కు హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళం, తమిళం, కన్నడలో చెరో సినిమా చేస్తున్న రెబ మోనికా జాన్ కు సూపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు టాక్. ఎందుకంటే ఇది ఆషామాషీ అవకాశం కాదు.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఒక కీలక పాత్రను రెబ మోనికా జాన్ కు ఆఫర్ చేసినట్టు చెన్నై టాక్. అధికారికంగా ఖరారు చేయలేదు కానీ లీకైన సోర్స్ ని బట్టి చూస్తే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాని రజనికి జోడిగా మాత్రం కాదట. ఒక యువ హీరోకు జంటగా కథను మలుపు తిప్పే క్యారెక్టర్ ని లోకేష్ ఇచ్చాడని అంటున్నారు. అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వేచి చూడాలి.

ఇది నిజమైతే మాత్రం మోనికా జాన్ కు జాక్ పాట్ తగిలినట్టే. గతంలో ఓ మూడు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. కానీ రజని మూవీ అందులోనూ లోకేష్ లాంటి డైరెక్టర్ అయితే చెప్పదేముంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కూలిని సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా కాకుండా విడిగా తీస్తున్నారు. ఇంకా షూట్ లో ఉండగానే దీని మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మూడు నాలుగు దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఆధారంగా ఇది రూపొందిస్తున్నట్టు తెలిసింది. రజని పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. 2025 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.