కళ్యాణ్ రామ్ పంట పండుతోంది

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఒకప్పుడు ఎలాంటి సాహసాలు చేశాడో తెలిసిందే. తన కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో ‘అతనొక్కడే’ సినిమా చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు నందమూరి హీరో. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయి తన కెరీర్‌ను మలుపు తిప్పింది. నిర్మాతగా మంచి లాభాలు కూడా అందించింది. కానీ తర్వాత అతడికి ఎక్కువగా ఎదురు దెబ్బలే తగిలాయి నిర్మాణంలో.

హరే రామ్, జయీభవ, కత్తి, ఓం త్రీడీ, ఇజం.. ఇలా సొంత బేనర్లో తాను హీరోగా నటించిన పలు చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో మిగతా సినిమాలు కొట్టిన దెబ్బ ఒకెత్తయితే.. ‘ఓం త్రీడీ’ కొట్టిన దెబ్బ మరో ఎత్తు. ఇవి చాలవన్నట్లు రవితేజతో చేసిన బయటి చిత్రం ‘కిక్-2’ కూడా తేడా కొట్టి కళ్యాణ్ రామ్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎందుకొచ్చిన నిర్మాణం అనుకునే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇలాంటి టైంలో తమ్ముడు ఎన్టీఆరే అన్నకు అండగా నిలిచాడు.

నిర్మాతగా కళ్యాణ్ రామ్‌కు అత్యధిక లాభాలు అందించిన సినిమా.. జై లవకుశ అని చెప్పాలి. ఆ సినిమా కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. నిర్మాతగా కళ్యాణ్‌ రామ్‌కు మంచి లాభాలు అందించింది. ఆ తర్వాత తనే హీరోగా నటించిన ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు నందమూరి హీరో. ఆ చిత్రం పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం తెచ్చి పెట్టింది.

ఇక ఇప్పుడు ‘దేవర’తో నిర్మాతగా మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువే కానీ.. అంతకుమించి బిజినెస్ కూడా జరిగింది. మంచి లాభాలకు సినిమాను అమ్మారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమాకు మంచి ఫలితం దక్కింది. బయ్యర్లు హ్యాపీ. నిర్మాతల్లో ఒకడిగా కళ్యాణ్ రామ్ ఇంకా హ్యాపీ. ఈ సినిమా సక్సెస్ కావడం దేవర-2కు పెద్ద ప్లస్. దానికి బిజినెస్ ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది. కాబట్టి నిర్మాతగా కళ్యాణ్ రామ్ పంట పండినట్లే. కొంచెం లేటుగా అయినా తన బేనర్‌కు ఇప్పుడు భలే కలిసి వస్తోంది.