ఆర్-5 జోన్ పై చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్

అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించా రు. 2019కి ముందు ఎలా అయితే.. అలానే రాజ‌ధానిని తీర్చిదిద్దేందుకు ఆయ‌న ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగా.. జ‌గ‌న్ హ‌యాంలో వ‌చ్చిన ఆర్‌-5 జోన్‌ను ఇక‌పై ఆయ‌న ర‌ద్దు చేయ‌నున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్ప‌కపోయినా.. న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అంటే.. త్వ‌ర‌లోనే ఆర్‌-5 జోన్ ర‌ద్దు కానుంది. అయితే.. ఇది ఒకింత భావోద్వేగాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

ఏంటీ ఆర్ – 5 జోన్!

అమ‌రావ‌తిలోని ప్రాంతాల‌ను చంద్ర‌బాబు హ‌యాంలోనే 9 జోన్‌లుగా విభ‌జించారు. న‌వ‌న‌గ‌రాలుగా నిర్మించాల‌ని పెట్టుకున్న ప్లాన్లో భాగంగా రాజ‌ధాని ప్రాంతాన్ని 9 జోన్‌లుగా పేర్కొంటూ.. జీవో కూడా ఇచ్చారు. వీటిలో ఆర్-5 జోన్ కీల‌కం. ఇది రాజ‌ధాని ప్రాంతంలో 900 ఎక‌రాల స్థ‌లం. ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు హ‌యాంలో నిర్ధారించిన మాస్ట‌ర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. త‌ద్వారా.. ఈ ప్రాంతం రాజ‌ధానికి మ‌రో ఆదాయ వ‌నరుగా మారుతుంద‌ని అనుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో ఈ జోన్ ల‌క్ష్యాన్ని మార్చేశారు. ఆర్‌-5 జోన్ అంటే.. ఎవ‌రైనా ఉండే ప్రాంతంగా నోటిఫై చేస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చారు. త‌ద్వారా.. గుంటూరు జిల్లాతోపాటు.. పొరుగున ఉన్న ప్ర‌కాశం, విజ‌యవాడ ప్రాంతాల‌కు చెందిన పేద‌ల‌కు కూడా.. ఇక్క‌డ స్థ‌లాలు కేటాయించారు. మొత్తం 10 ల‌క్ష‌ల మందికి ఇక్క‌డ సెంటున్న‌ర చొప్పున స్థ‌లాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకున్నారు. వీరిలో 3 ల‌క్ష‌ల మందికి ప‌ట్టాల పంపిణీ కూడా అయిపోయింది. స్థ‌లాల హ‌ద్దులు కూడా కేటాయించారు.

న్యాయ పోరాటం!

అయితే.. రాజ‌ధాని రైతులు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై కోర్టుకువెళ్లారు. దీంతో ఆర్‌-5 జోన్‌పై విచార‌ణ జ‌రిగింది. ఈ జోన్‌లో ఇళ్ల‌ను కేటాయించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. ప‌ట్టాల‌పై మాత్రం కోర్టు తుది నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టంగా పేర్కొనాల‌ని తెలిపింది. అలానే ప‌ట్టాల‌ను ఇచ్చారు. అయితే.. ఇలా రాజ‌ధాని మ‌ధ్య‌లో పేద‌ల‌కు ముఖ్యంగా ఇత‌ర ప్రాంతాల వారికి స్థ‌లాలు ఇవ్వ‌డాన్ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే వ్య‌తిరేకించారు.

తాజాగా.. ఇచ్చిన అమ‌రావ‌తి రాజ‌ధాని వైట్ పేప‌ర్ పై మాట్లాడుతూ.. ఆర్‌-5 జోన్‌ను గ‌తంలో ఏ అవ‌స‌రాల కోసం.. కేటాయిస్తామ‌ని చెప్పామో.. దానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇక్క‌డ స్థలాలు పొందిన వారికి.. వారివారి సొంత ప్రాంతాల్లోనే స్థ‌లాలు కేటాయిస్తామ‌న్నారు. అంటే.. ఆర్‌5 జోన్ ఇక‌పై వ్యాపారానికి మాత్ర‌మే కేటాయించ‌నున్నారు.