పవన్ దిగాడు.. కేసు పరిష్కారం

ప్రభుత్వంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే.. ఎలాంటి కేసు అయినా ఎలా పరిష్కారం అవుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువయ్యాక అనేక విషయాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండటం ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి కావడం.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడడం లాంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్న ఒక కేసు కొన్ని రోజుల్లో పరిష్కారం అయిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. సెషన్ అయ్యాక పవన్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించగా, తన కూతురు 9 నెలలుగా కనిపించట్లేదని, పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదని.. భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ కన్నీళ్లతో పవన్‌కు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు బాధితురాలి వేదనను సావధానంగా విన్న పవన్.. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో విజయవాడ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో సదరు యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక్కడి నుంచి స్పెషల్ టీం వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మూ నుంచి యువతి, యువకుడిని స్పెషల్ టీం విజయవాడకు తీసుకొస్తోంది. పవన్ అలెర్ట్ చేయడంతో ఈ కేసును విజయవాడ పోలీసు కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. యువతి ఎక్కడ ఉందో ట్రేస్ చేసి స్పెషల్ టీంను జమ్ముకు పంపించారు. ఈ కేసు ఇంత వేగంగా పరిష్కారం కావడంలో పవన్ తీసుకున్న చొరవ ప్రశంసలందుకుంటోంది.