ఏపీలో ముదిరిన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం

ఏపీలో కీల‌క‌మైన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం ముదిరింది. వైసీపీ హ‌యాంలో 2019లో నియ‌మితులైన వ‌లంటీర్ల విష‌యం.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పెను వివాదం రేపిన విష‌యం తెలిసిందే. వీరంతా వైసీపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్నార‌ని.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొంటూ.. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ అనే స్వ‌చ్ఛంద సంస్త కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో ఎన్నిక‌ల వేళ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూట‌మి.. తాము అధికారంలోకి వ‌స్తే వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌ని హామీ ఇచ్చింది.

అంతేకాదు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రో అడుగు ముందుకు వేసి.. తాము అధికారంలోకి వ‌చ్చాక వ‌లంటీర్ల వేత‌నాల‌ను రూ.5000 నుంచి రూ.10 వేల‌కు పెంచుతామ‌ని చెప్పారు. అయితే..స‌ర్కారు వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోలేదు. అంతేకాదు.. జూలై 1వ తేదీన ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇవ్వాల్సిన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోని కార్య‌ద‌ర్శులు, ఇత‌ర సిబ్బందితో పంపిణీ చేయించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏం చేస్తార‌నే చ‌ర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అస‌లు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏపీ హైకోర్టులో తాజాగా పిటిష‌న్ దాఖ‌లైంది. గ‌త వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన వ‌లంటీర్ నియామాలు అన్నీ.. అస్ప‌ష్టంగా ఉన్నాయని.. రిజ‌ర్వేష‌న్ల‌ను పాటించ‌లేద‌ని పిటిష‌నర్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైసీపీకి నాయ‌కుల అనుచ‌రుల‌ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌లంటీర్లుగా నియ‌మించుకున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌నే ర‌ద్దు చేయాల‌ని కోరారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. స‌మాధానం చెప్పాలంటూ చంద్ర‌బాబు స‌ర్కారును ఆదేశించింది.

ర‌ద్దు చేస్తే..

ప్ర‌స్తుతం వేసిన పిటిష‌న్‌పై హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం చెబుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. స‌మాధానం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తే.. రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఇబ్బంది వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఒక వేళ ఇప్పుడున్న వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసినా కొత్త‌గా నూత‌న వ‌లంటీర్ల నియామ‌కం చేప‌ట్టే అవ‌కాశం ఉంది. అయితే.. అప్పుడు ఏ విధానంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తారో చూడాలి. ఇదిలావుంటే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఓన్ చేసుకున్న‌ వైసీపీ మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.