కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన పోచారం.. రేవంత్ రియాక్ష‌న్ ఇదే!

తెలంగాణ మాజీ స్పీప‌ర్‌, బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కుడు.. పోచారం శ్రీనివాస‌రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గ‌తంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న పోచారం.. ఎంతో మంది పోటీలో ఉన్న‌ప్ప‌టికీ.. అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోచారం మ‌రోసారి బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. 23 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు. అయితే.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవ‌డంతో ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.

తాజాగా త‌న కుమారుడు భాస్క‌ర‌రెడ్డితో క‌లిసి.. సీఎం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో పోచారం పార్టీ మారి.. కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. పోచారం ఇంటికే వెళ్లిన సీఎం రేవంత్‌.. ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, సంక్షేమాన్ని చూసి.. చాలా మంది నాయ‌కులు పార్టీ మారుతున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలోను పార్టీలోనూ.. పోచారానికి గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానం క‌ల్పిస్తామ‌న్నారు. పోచారం గౌర‌వానికి ఎక్క‌డా భంగం క‌ల‌గ‌ద‌ని చెప్పారు. వారి రాక‌ను కాంగ్రెస్ పార్టీ మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు.

పోచారం మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయ రంగానికి రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్ర‌ధాన ప్రాధాన్యాన్ని మ‌న‌సులో పెట్టుకుని.. పార్టీ మారిన‌ట్టు చెప్పారు. రైతు సంక్షేమం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతోనే.. తాను పార్టీ మారాన‌న్నారు. రైత‌ల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి త‌న‌కు మిత్రుడేన‌ని.. ఆయ‌న స‌హ‌కారంతో అంద‌రికీ మేలు జ‌రిగేందుకే తాను పార్టీ మారిన‌ట్టు చెప్పారు. తాను ఏ ప‌ద‌వులు ఆశించి.. కాంగ్రెస్‌లోకి రాలేద‌న్నారు.

కాగా.. పార్టీ మారిన సంద‌ర్భంలో బీఆర్ఎస్ నాయ‌కులు చేసిన ఆందోళ‌న‌ను ఆయ‌న కొట్టి పారేశారు. తాను గ‌తంలో టీడీపీ, అంత‌కు ముందు కాంగ్రెస్‌లో ఉన్నాన‌న్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లాన‌ని, త‌ర్వాత‌.. బీఆర్ఎస్‌లోకి వ‌చ్చాన‌ని.. ఇప్పుడు రేవంత్ నాయ‌క‌త్వం న‌చ్చి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపారు. వ‌చ్చే 20 ఏళ్ల‌పాటు రేవంత్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని తాను విశ్వ‌సిస్తున్న‌ట్టు పోచారం తెలిపారు.