జగన్ ట్వీట్‌కు మాస్ రెస్పాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి కేవలం 11 సీట్లకు పరిమితం అయిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సోషల్ మీడియాలో మాస్ రెస్పాన్స్ వస్తోందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? ఈ రెస్పాన్స్ వస్తోంది ఆయన అభిమానుల నుంచి కాదులెండి. ఆయన వ్యతిరేకుల నుంచి. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి.. ఓడిన నాటి నుంచి వైసీపీ నేతలంతా ఎవరినో నిందించడానికి చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు కానీ.. జనాల చేతుల్లో మోసపోయిన తొలి నాయకుడు జగనే అంటూ కొన్ని రోజులు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు తిప్పారు. తర్వాత చంద్రబాబు సాధ్యం కాని, అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని నిష్ఠూరమాడారు. దీంతో పాటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతో ఈవీఎంలను హ్యాక్ చేసి కూటమి గెలిచేసిందని కొత్త పాట కూడా అందుకున్నారు.

తాజాగా జగన్ సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతిని పాటిస్తున్నారని.. కాబట్టి ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ జగన్ తాజాగా ట్వీట్ వేశారు. ఐతే ఈ ట్వీట్ కింద కామెంట్లు, కోట్స్ చూస్తే.. జగన్ అండ్ కో తలలు ఎక్కడ పెట్టుకుంటారో అనిపిస్తోంది. ఇదే జగన్ 2019లో ఘనవిజయం సాధించినపుడు టీడీపీ వాళ్లు ఈవీఎం హ్యాకింగ్ గురించి ఆరోపణలు చేస్తే.. ఎదురుదాడి చేస్తూ మాట్లాడారు.

2014లో గెలిచినపుడు బాబు కూడా ఈవీఎంలు హ్యాక్ చేశాడా అని ప్రశ్నించడంతో పాటు 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని కూడా ప్రస్తావించి ఈవీఎం హ్యాకింగ్‌, టాంపరింగ్ ఆరోపణలపై ఎగతాళిగా మాట్లాడారు. కోట్స్, కామెంట్లలో చాలా వరకు ఈ వీడియోలే కనిపిస్తున్నాయి. మరోవైపు అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు ఈవీఎం టాంపరింగ్ ఆరోపణల మీద టీడీపీ తీరును ఎండగడుతూ, ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియోలతో జగన్‌కు ట్విట్టర్ జనాలు మాస్ రిటార్ట్స్ ఇస్తున్నారు. అంతే కాక హుందాగా ఓటమిని ఒప్పుకోకుండా సాకులు వెతుకుతున్నారని, ఇంకా మబ్బులోనే ఉన్నారంటూ అనేక మీమ్స్ పెట్టి జగన్‌ను ట్రోల్ చేస్తున్నారు.