చేసిన పాపం.. పొన్న‌వోలుకు శాపం..

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ అడుగుల‌కు మ‌డుగులొత్తిన అధికారులు.. ఇప్పుడు తెర‌చాటున రోదిస్తున్నారు. ఉన్న‌తాధికారులుగా చ‌క్రం తిప్పిన వారంతా ఇప్పుడు అలో ల‌క్ష్మ‌ణా అనిఏడుస్తున్నారు. ఎందుకు చేశామ‌ని త‌ల బాదుకుంటున్నారు. వీరిలో  మాజీ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం మాజీ ఈవో ధ‌ర్మారెడ్డి వ‌ర‌కు అదేవిదంగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి.. సీతారామాంజ‌నేయుల దాకా.. అంద‌రిదీ ఒకే దారి. అంద‌రిదీ ఒకే వేద‌న‌. జ‌గ‌న్ చెప్పింది.. చేసి.. అతిగా వ్య‌వ‌హ‌రించి.. చ‌ట్టాన్ని తుంగ‌లో తొక్కారు.

ఫ‌లితంగా ఇప్పుడు క‌నీసం సీఎం పేషీవైపు వ‌చ్చే అవ‌కాశం కానీ త‌మ వేద‌న‌ను బాధ‌ను చెప్పుకొనేందుకు కూడా.. వారికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక‌, ఇదే వ‌రుస‌లో అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌(ఏఏజీ) పొన్న వోలు సుధాక‌ర్ రెడ్డి ప‌రిస్థితి వ‌చ్చింది. ఈయ‌న కూడా.. గ‌త ప్ర‌భుత్వంలో సీఎం జ‌గ‌న్ చెప్పింది.. చెప్పందీ కూడా చేశారు. ఆయ‌నే స‌ల‌హాలు ఇచ్చి.. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడిపై కేసులు పెట్టేలా.. సెక్ష‌న్లు మార్చేలా వ్య‌వ‌హ‌రించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

మ‌రీ ముఖ్యంగా నారా లోకేష్‌ను ఫైబ‌ర్ నెట్ కేసులో ఇరికించేందుకు.. అమ‌రావ‌తి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్ర‌బాబుకు బెయిల్ కూడా రాకుండా చేయ‌డంలోనూ.. పొన్న‌వోలు కీల‌క పాత్ర పోషించారు. ఎన్నిక‌ల‌కుముందు ఆయ‌న సెంట‌రాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా మారిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. స‌ర్కారు మారిపోయింది. ఇప్పుడు పొన్న‌వోలు ఫేట్ కూడా మారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కారణం తాజాగా ఆయ‌న‌పై పోలీసులు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు.

 మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై టీడీపీ నేత తోపూరి గంగాధర్ మంగ‌ళ‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై పొన్నవోలు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేశార‌ని గంగాధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంగ‌ళ‌గిరి పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. ఎఫ్ ఐఆర్ కాపీని మీడియా కు ఇచ్చేందుకు పోలీసులు తిర‌స్క‌రించారు. దీంతో పొన్న‌వోలు వ్య‌వ‌హారం కూడా చిక్కుల్లో ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.