క‌న్నాకు అందుకే నో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం చంద్ర‌బాబు సార‌థ్యంలో కొత్త మంత్రివ‌ర్గం కొలువుతీరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి అంద‌రికీ ఆమోదయోగ్యంగా కేటినేట్‌ను ఏర్పాటు చేసుకుంది. మంత్రివ‌ర్గ ఏర్పాటులో చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేసి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు. కానీ మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ మాత్రం కాస్త నిరాశ‌కు లోన‌యిన‌ట్లు తెలిసింది. కానీ ఎలాంటి స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం చూసినా క‌న్నాకు బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం లేక‌పోయింద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సీనియ‌ర్ లీడ‌ర్ క‌న్నా లక్ష్మీనారాయ‌ణ గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌పుడ‌ల్లా గుంటూరు జిల్లా కోటా కింద క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేవాళ్లు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌కు ముందు కూడా ఆయ‌న కాంగ్రెస్ మంత్రివ‌ర్గంలోనే ఉన్నారు. కానీ రాష్ట్రం విడిపోయాక బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగానూ ప‌నిచేశారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి గెలిచారు. దీంతో చంద్ర‌బాబు కేబినేట్‌లో ఆయ‌న‌కు క‌చ్చితంగా చోటు ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ పార్టీ భ‌విష్య‌త్ దృష్ట్యా బాబు నిర్ణ‌యాలు తీసుకున్నారు. మ‌రోవైపు గుంటూరు జిల్లా, కాపుల కోటా చూసుకున్నా క‌న్నాకు అవ‌కాశం ద‌క్క‌కుండా పోయింది.

కూట‌మి ప‌రంగా చూసుకుంటే కాపుల కోటాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నిమ్మ‌ల రామానాయుడు, కందుల దుర్గేశ్‌, పొంగూరు నారాయ‌ణ‌ల‌కు బాబు చోటు క‌ల్పించారు. టీడీపీ నుంచి ఛాన్స్ ద‌క్కించుకున్న రామానాయుడు, నారాయ‌ణ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారు. నారాయ‌ణ ఆర్థికంగా అండ‌గా నిలిచారు. అందుకే బాబు ఈ ఇద్ద‌రికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో క‌న్నాకు నిరాశే మిగిలింది. ఇక గుంటూరు జిల్లా నుంచి చూసుకుంటే నాదెండ్ల మ‌నోహ‌ర్‌, అన‌గాని స‌త్య‌కుమార్‌, నారా లోకేశ్‌కు ప‌ద‌వులు ద‌క్కాయి. ఆ జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో క‌న్నాను ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంద‌నే చెప్పాలి.