భూములు మింగేశారా? బీఆర్ఎస్ నేత‌ల‌కు రేవంత్ టెన్ష‌న్‌

తెలంగాణ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాభ‌వాల‌తో బీఆర్ఎస్ కుంగిపోయింది. ఏదో చేయాల‌ని, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని క‌ల‌లు క‌న్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. పార్టీలోని ఎమ్మెల్యేలు, కీల‌క‌ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా చేజారుతున్నారు. మ‌రోవైపు ఫోన్ ట్యాపింగ్‌, గొర్రెల పంపిణీ, కాశేళ్వ‌రం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల‌లో అవినీతి ఆరోప‌ణ‌ల‌తో బీఆర్ఎస్ పెద్ద త‌ల‌కాయ‌లే టార్గెట్‌గా రేవంత్ ప్ర‌భుత్వం సాగుతోంది.

ఇప్ప‌టికే విద్యుత్ కొనుగోళ్లలో అవ‌త‌వ‌క‌ల‌పై కేసీఆర్ నోటీసులు అందుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లంద‌రి మెడ‌కు ఉచ్చుగా బిగుసుకుంటోంది. మ‌రోవైపు కాళేశ్వ‌రం ప్రాజెక్టు, గొర్రెల పంపిణీలో అవినీతిపై విచార‌ణ కొన‌సాగుతోంది. తాజాగా భూ క‌బ్జాల నేరం కింద బీఆర్ఎస్ నేత‌ల‌కు షాకిచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో భూముల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించారు. దీంతో ఆక్ర‌మించిన భూముల‌కూ ఫీజు చెల్లించి ఎంతో మంది ఆ భూముల‌ను త‌మ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని హైద‌రాబాద్ శివారుల్లో ఇలాగే ప్ర‌భుత్వ‌ భూముల‌ను క‌బ్జా చేసి, ఆ త‌ర్వాత క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌తో కొట్టేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. వీటి వెనుకు బీఆర్ఎస్‌లోని కీల‌క నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. త‌మ డ్రైవ‌ర్లు, ప‌నివాళ్లు, అనుచ‌రుల పేర్ల‌తో ఈ బ‌డా నాయ‌కులు ఈ భూముల‌ను మింగేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ భూ క‌బ్జాల‌పై విచార‌ణ‌కు రేవంత్ ప్ర‌భుత్వం సిద్ధమైంది. వీటి వెనుక ఉన్న బీఆర్ఎస్ నాయ‌కుల‌ను బ‌య‌ట‌కు లాగేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది.