సీత‌క్క కొత్త ఛాలెంజ్..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌ల ఫ‌లితంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం జాడ వెతుక్కునే ప‌రిస్థితి ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొంద‌రు మాత్ర‌మే పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నారు.

ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఒక‌రు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే ఎమ్మెల్యే సీత‌క్క తీరు గ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేసిన వివిధ సేవ కార్య‌క్ర‌మాల కార‌ణం‌గా ఆమె పాపులారిటీ సంపాదించారు. అయితే, ఇప్పుడు మ‌రో ముంద‌డుగు వేశారు.

లాక్ డౌన్ వ‌ల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి వాళ్ల ఆక‌లిని తీర్చేలా పేద ప్ర‌జ‌ల కోసం మంచి ఆలోచ‌న చేసిన సీత‌క్క పేద‌ల‌కు సాయం చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్ప‌టికే లాక్ డౌన్ క్ర‌మంలో ఇంట్లో కాళీగా ఉన్న కొంద‌రు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల‌తో టైమ్ పాస్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, దీనికంటే భిన్నంగా సీత‌క్క కొత్త ఛాలెంజ్ విసిరారు. గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో ఒక‌రు కొంత మంది పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేయాలి. వారు మ‌రొక‌రికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ని ఛాలెంజుల క‌న్నా ఆక‌లితో అల‌మ‌టించేవారి ఆక‌లిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదని నెటిజ‌న్లు అంటున్నారు.

ఈ చాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ, మాజీ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డిల‌కు చాలెంజ్ ‌విసిరిన సీత‌క్క త‌న సోద‌రులు ఈ చాలెంజ్ పూర్తి చేసి అన్నార్తుల క‌డుపు నింపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.