ఒక్క దెబ్బకు మూడు పిట్టలు

గత ఐదేళ్లలో తెలుగుదేశం అభిమానులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో వాళ్లు దుర్భర పరిస్థితులను అనుభవించారు. తెలుగుదేశం అత్యంత దారుణమైన పరాభవం చవిచూసింది ఆ ఎన్నికల్లో. ఆ స్థితి నుంచి టీడీపీ మళ్లీ పుంజుకోగలదా అన్న సందేహాలు నెలకొన్నాయి.

మరోవైపు తెలంగాణలో వరుసగా రెండో పర్యాయం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం ఉనికే లేకుండా పోయింది. ఇంకోవైపు కేంద్రంలో మోడీ సర్కారు మరింత బలోపేతమై.. టీడీపీని ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా టీడీపీకి ఏ రకంగానూ ఆశాజనకమైన పరిస్థితులు కనిపించలేదు. కానీ ఐదేళ్లు గడిచేసరికి మొత్తం కథ మారిపోయింది. ఈ మూడు చోట్లా టీడీపీ వాళ్లు ఎంతో సంతోషించే ఫలితాలు వచ్చాయి.

ముందుగా గత ఏడాది చివర్లో తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పైగా టీడీపీ వాళ్లు ఎంతో అభిమానించే మాజీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అది కాంగ్రెస్ వాళ్లకంటే టీడీపీ మద్దతుదారులకే ఎక్కువ ఆనందాన్నిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఇక లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి చరిత్రాత్మక విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తిని 240 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయే మిత్ర పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన స్థితికి వచ్చింది. టీడీపీ మద్దతు ఇప్పుడు ఎంతో కీలకం. దీని వల్ల వచ్చే ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఇలా మూడు చోట్ల టీడీపీ వాళ్లు సంతోషించే ఫలితాలు వచ్చాయి. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్లు తయారైంది పరిస్థితి.