అభిమన్యుడు కాదు అర్జునుడు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరినోట విన్నా, ఎక్కడ నలుగురు కలుసుకున్నా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అవమనానాలు, అవహేళనలను ఎదుర్కొని వెంటబడి మరీ జగన్ ను ఓడించడం వెనక పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదల ఉంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశాడు. అదే లక్ష్యంగా పట్టు వదలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరే వరకు విడిచి పెట్టలేదు. మోడీ, బాబుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నుండి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో వెనక పవన్ కష్టాన్ని ఎవరూ కాదనలేరు.

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, ఇతర రాయితీల విషయంలో కేంద్రంలో ఎన్డీఎ మొండిచేయి చూపడంతో చంద్రబాబుకు మోడీతో చెడింది. దీంతో ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్నాడు. ఆగర్భశతృవు కాంగ్రెస్ తో జట్టుకట్టినా బాబుకు కాలం కలిసిరాలేదు. మోడీకి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు పెట్టడంతో బాబుకు మోడీతో పూర్తిగా చెడింది.

2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు మరింత బలహీనపడ్డాడు. రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కోవాలంటే మోడీతో మళ్ళీ చేతులు కలపటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కానీ ఎంత మంది ప్రయత్నించినా బీజేపీ చంద్రబాబును దగ్గరకు రానివ్వలేదు. అయితే ఇదే సమయంలో బీజేపీ నుంచి సంకేతాలు రాకముందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ టీడీపీ-జనసేన ఈ రోజు నుంచే కలిసి పనిచేస్తాయని ప్రకటించాడు. చంద్రబాబు జైలుకెళ్ళిన ఒక విషాద సందర్భంలో, దైన్య స్థితిలో పవన్ చేసిన పొత్తు ప్రకటన ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టువదలకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీ కూటమికి అంకురార్పణ చేశాడు.

2014లో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ కు చెడింది. పవన్ చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసి ఆరోపణలు చేయడంతో టీడీపీ మీడియా విభాగం పవన్ ను టార్గెట్ చేసింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అమరావతి విధ్వంసంపై పవన్ రైతులకు అండగా నిలిచాడు. చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు అసెంబ్లీ లోపలా, బయటా జరిగిన అవమానాలపై పవన్ స్పందించాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులకు అండగా నిలిచి ఆర్ధిక సాయం అందించాడు.

ఈ సమయంలోనే టీడీపీ-జనసేన మధ్య మళ్ళీ సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో అధికార వైసీపీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. పోలీస్ బలగాలతో ఆయన పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అన్నిటినీ పవన్ ఎదిరించాడు. అధికారపార్టీ నుంచి ఎన్నో వేధింపులు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేశాడు.

వైసీసీని ఓడించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి అన్న లక్ష్యంతో పవన్ పనిచేశాడు. 60 నుండి 70 స్థానాలు అడగాలని జనసైనికులు డిమాండ్ చేశారు. కనీసం 40 – 50 అడగాలని సూచించారు. కానీ కేవలం 24 స్థానాలకు ఒప్పుకున్నాడు. బీజేపీకి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితులలో 21 స్థానాలకు పరిమితం అయ్యాడు. తన పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించుకుని కూటమి అభ్యర్థుల ఘనవిజయంలో కీలకపాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు అందరూ పవన్ ను అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.