కంగనాకు చెంప దెబ్బ .. కానిస్టేబుల్ సస్పెండ్ !

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి బీజేపీ లోక్ సభ సభ్యురాలు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేధు అనుభవం ఎదురయింది. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్‌ అన్నారు. ఈ మేరకు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు.

కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వెల్లడించారు.

కానిస్టేబుల్ కుల్విందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు సీఓ గదిలో నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. మండి లోక్ సభ స్థానంలో కంగనా 70 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.