త‌మిళ ఎంపీల‌తో మ‌నోళ్ల‌కు క్లాసిప్పించాల్సిందే!!

మ‌న‌లో మ‌నం ఎన్ని అనుకున్నా.. పొరుగువారి ముందు మాత్రం మ‌న ఐక్య‌త చాటాల‌నే సూత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగ‌వుతోంది. ఎక్క‌డ వేదిక దొరికినా.. అది ఏపీనా.. ఢిల్లీనా.. అనే తేడా లేకుండా వైసీపీ-టీడీపీ నేత‌లు జుట్టూ జుట్టూ ప‌ట్టుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా .. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. అధికార ప‌క్షం విమ‌ర్శించుకోవ‌డం, త‌ప్పుల‌ను ఎత్తి చూపించుకోవ‌డం తెలిసిందే. ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉన్న‌దే.

కానీ, అదే రాష్ట్రానికి సంబంధించి.. ప‌రాయి రాష్ట్రం లేదా.. కేంద్రం నుంచి స‌హ‌కారం లోపించిన‌ప్పుడు.. లేదా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వారి వ‌ల్ల విఘాతం ఏర్ప‌డుతున్నప్పుడు.. స్వ‌ప‌క్షం.. విప‌క్షం అనే తేడా లేకుండా ఒక్క‌టై పోవ‌డం స‌హ‌జం. ఇరు ప‌క్షాలూ క‌లిసి సాధించి.. స‌ద‌రు ల‌బ్ధిని ఉమ్మ‌డిగా ఖాతాలో వేసుకుంటారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు .. వామ‌ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి వెళ్లి.. ఆయ‌న కేంద్రంలోని కాంగ్రెస్ స‌ర్కారును నిల‌దీసిన సంద‌ర్భాలు ఉన్నాయి. రాష్ట్రానికి ల‌బ్ధి చేకూర్చిన ఘ‌ట‌న‌లు కూడా క‌నిపించాయి. కానీ, రానురాను ఈ త‌ర‌హా రాజ‌కీయాలు మారిపోయి.. స్వార్థ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతోంది.

త‌మిళ‌నాడును తీసుకుంటే.. అక్క‌డి రాష్ట్ర ప్ర‌యోజనాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడాల్సి వ‌స్తే.. స్వ‌ప‌క్ష-విప‌క్ష స‌భ్యులు పార్ల‌మెంటులో ఒకే తాటిపైకి వ‌చ్చేస్తారు. హిందీతో కూడిన‌ త్రిభాషా సూత్రం కావొచ్చు, కావేరీ జ‌ల వివాదం కావొచ్చు.. పార్ల‌మెంటులో మాట్లాడాల్సి వ‌స్తే.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం అనేది మ‌న‌కు క‌నిపించ‌దు. క‌ర్ణాట‌క‌లోనూ దాదాపు రెండు మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్తితే ఉంది. కానీ, ఎటొచ్చీ.. ఏపీ ప‌రిస్థితి మాత్రం నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. టీడీపీ – వైసీపీ ఎంపీలు.. ఢిల్లీని కూడా ఏపీని చేసేస్తున్నారు.

సంయుక్తంగా రాష్ట్ర డిమాండ్ల‌పై పోరాడాల్సిన ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌నే ధోర‌ణితోనే ముందుకు సాగుతున్నారు. ఒక‌రికి ఒకరు అడ్డుతగులుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో సంయుక్తంగా పోరాడితే.. ప్ర‌త్యేక హోదా స‌హా నిధులు కూడా ఎన్న‌డో వ‌చ్చేవ‌న్న విజ్ఞుల మాట‌ల‌ను కూడా వారు ప‌ట్టించుకోవ‌డంలేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ ఇదే మాట చెప్పారు. హోదా విష‌యంలో క‌లిసి పోరాడ‌దాం.. అంటే.. బాబు ఒప్పుకోలేదు. ఇక‌, అప్ప‌టి నుంచి ఎవ‌రిదారి వారిదే. అయితే, ఈ క్ర‌మంలో ఇది ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చూకూర్చ‌క‌పోగా..కేంద్రానికి ఆట‌విడుపుగా మారింది. దీంతో మ‌న ఎంపీల‌కు త‌మిళ‌నాడు ఎంపీలతో క్లాస్ ఇప్పిస్తే.. కొంతైనా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.