పవన్ కు డబుల్ హ్యాపీ.. ఏపీలో ఆ అంచనానే నిజం కానుందా?

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న తీరుకు తెలుగు తమ్ముళ్లు సైతం షాక్ తింటున్నారు. గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ.. గెలిచే విషయంలో వారికున్న భయాలు.. ఆందోళనలు.. తమ పార్టీకి ఉన్న బలహీనతల కారణంగా గెలుపు అంత తేలిక కాదని.. వైసీపీ లాంటి మేరు పర్వతాన్ని ఢీ కొనే సత్తా తమకు లేదన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించేవారు. అయితే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలు మాత్రం ఊహించని రీతిలో ఉంటున్న పరిస్థితి.

ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడిన తర్వాత..ఏపీకి సంబంధించి ఎక్కువ సంస్థలు వెల్లడించిన అంచనాల ప్రకారం తెలుగుదేశం కూటమి ఖాయంగా అధికారంలోకి వస్తుందని. అయితే.. దీన్ని విభేదించినోళ్లు చాలామందే ఉన్నారు. దీనికి తోడు వైసీపీ నేతలు ఆత్మవిశ్వాసం సైతం తెలుగు తమ్ముళ్లలో తెలియని ఆందోళనకు గురి చేసింది. అయినప్పటికీ సర్వే చేసిన కొన్ని సంస్థలకు చెందిన వారు మాత్రం కాన్ఫిడెంట్ గా ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంగా ఆసక్తికర విశ్లేషణ తెర మీదకు వచ్చింది. కొందరి అంచనా ప్రకారం.. ఏపీలో కూటమి జోరుకు ఆశ్చర్యకర రీతిలో ఫలితాలు ఉంటాయని.. అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఇంతకాలం పవన్ ను అదే పనిగా టార్గెట్ చేసిన దానికి బదులుగా.. ఆ పార్టీకి వచ్చే సీట్ల కంటే తక్కువ సీట్లకు వైసీపీ పరిమితం అవుతుందన్న మాటను చెప్పారు. ఓవైపు వైనాట్ 175 అనే వేళలో.. ఇలాంటి మాటలేంది? అసలు సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా వెలువడుతున్న అధిక్యతలు చూస్తున్నప్పుడు ఆ విశ్లేషణకు దగ్గర్లో ఫలితాలుచోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదయం పదకొండున్నర గంటల సమయానికి ఏపీ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 175 స్థానాలకు తెలుగుదేశం పార్టీ సొంతంగా 133 స్థానాల్ని.. జనసేన 20 స్థానాల్లో.. దాని మిత్రపక్షమైన బీజేపీ ఏడు స్థానాల్లో అధిక్యతలో ఉంటే.. అధికార వైసీపీ మాత్రం 14 స్థానాల్లోనే అధిక్యత ఉండటం షాకింగ్ గా మారింది.

అంటే.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్ని చూస్తే.. జనసేన అధిక్యతలో ఉన్న స్థానాలతో పోలిస్తే.. చాలా తక్కువ స్థానాల్లో వైసీపీ అధిక్యతలో ఉన్న పరిస్థితి. ఒకవేళ ఇదే ఫలితం అంతిమంగా తేలితే.. పవన్ కల్యాణ్ కు డబుల్ బొనాంజాగా చెప్పక తప్పదు. తాను.. తన పార్టీ.. తాను మద్దతు ఇచ్చిన కూటమి గెలవటం ఒక ఎత్తు అయితే.. తమ పార్టీకి వచ్చిన సీట్ల కంటే వైసీపీకి వచ్చిన సీట్లు తగ్గితే.. అంతకు మించిన ఆనందం ఏముంటుందన్నదే ఇప్పుడు చర్చగా మారింది.