ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మెలిక.. ఏసేసుకున్న బీజేపీ!

మ‌రికొన్ని గంట‌ల్లో 7వ దశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌నుంది. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల‌ను వెల్ల‌డించేందుకు సుమారు దేశ‌వ్యాప్తంగా 112 సంస్థ‌లు రెడీ అయ్యాయి. దేశంలోని 543 పార్ల‌మెంటు స్థానాలు.. ఏపీ, ఒడిశా స‌హా.. నాలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల స‌ర‌ళి, ప్ర‌జా తీర్పున‌కు సంబందించి ఈ సంస్థ‌లు స‌ర్వేలు.. అంచ‌నాలు వెల్ల‌డించేందుకురెడీ అయ్యాయి. వాస్త‌వ ఫ‌లితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాలి. కానీ, ఈ లోగా వ‌చ్చే ఎగ్జిట్ ఫ‌లితం నిజ‌మైనా కాక‌పోయిన‌.. కొంత మేర‌కు ప్ర‌జ‌ల‌ను లేదా ఆయా పార్టీల‌ను ఊర‌డిస్తుంది.

దీంతో ఎగ్జిట్ పోల్స్ కు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఇక‌, ఎగ్జిట్ పోల్స్ అలా వ‌స్తున్న క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన టీవీ చానెళ్ల‌న్నీ కూడా.. చ‌ర్చావేదిక‌లు పెడుతుంటాయి. ఎగ్జిట్ ఫ‌లితాల స‌ర‌ళి.. సీట్లు, ఓట్లు, కులాలు, మ‌తాలు.. ప్రాంతాలు.. నియోజ‌క‌వర్గాలు.. అభ్య‌ర్థులు, పార్టీలు.. ఇచ్చిన హామీలు.. చేసే ప‌నులు .. అబ్బో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అంశాల‌పై త‌ల‌పండిన పండుతున్న మేధావులను స్టూడియోల్లో కూర్చోబ‌ట్టి మ‌రీ.. చ‌ర్చ‌లు చేస్తారు. మొత్తంగా శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి దాదాపు 9 వ‌ర‌కు అంటే మూడు గంట‌ల పాటు దేశ‌వ్యాప్తంగా ప్రైమ్ టైమ్ చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.

దీంతో ఇప్ప‌టికే మేధావుల కాల్ షీట్లు ఫుల్ అయిపోయాయి. వీటిలో ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు.. పార్టీల త‌ర‌ఫున ప్ర‌తినిధులు.. ఇత‌ర నేత‌లు కూడా పాల్గొంటారు. వారి వారి అభిప్రాయాలు పంచుకుంటారు. ఇది.. ఆస‌క్తిక‌రం కావ‌డంతో నాయ‌కులు కూడా ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొనేందుకు నాయ‌కులు ఉత్సాహంగా ముందుకు వ‌స్తారు. అయితే.. ఈ విష‌యంలో జాతీయ‌పార్టీ అయిన కాంగ్రెస్ కొన్ని బార్స్ పెట్టింది. ఎవ‌రూ కూడా. ఏ చ‌ర్చ‌లోనూ పాల్గొన కూడ‌ద‌ని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి దేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఈ నిబంధ‌న‌లు పాటించాల‌ని పేర్కొంది.

ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తార‌నే విష‌యం ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఈవీఎంల‌లో తేల్చేశారు. ఇప్పుడు ఫ‌లితాల‌కు ముందు ఇలాంటి చ‌ర్చ‌ల‌తో టైం వేస్ట్‌. పైగా ఒక‌పార్టీ మ‌రొక పార్టీ మ‌ధ్య‌స్ప‌ర్థ‌లు పెంచుకోవ‌డం అవుతుంది. కాబ‌ట్టి.. ఎవ‌రూ కూడా.. చ‌ర్చల్లో పాల్గొన‌వ‌ద్దు అని పార్టీ సీనియ‌ర్ నేత ప‌వ‌న్ ఖెరా పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని.. పార్టీ పీసీసీ చీఫ్‌ల‌కు కూడా ఆదేశాలు వ‌చ్చాయి.

అయితే.. ఈ నిర్ణ‌యంపై బీజేపీ తీవ్ర‌స్థాయిలో కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. కాంగ్రెస్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని .. అందుకే చ‌ర్చించేందుకు కూడా భ‌య‌ప‌డుతోంద‌ని పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఓట‌మి ఖార‌రైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనిని ఒప్పేసుకుంది అని ఆయ‌న ఎద్దేవా చేశారు.