ఎవ‌రి టెన్ష‌న్ వారిదే… ఏపీ పోలింగ్ ఎఫెక్ట్‌!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు? అనే చ‌ర్చ ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది మ‌రో నాలుగు రోజుల వ‌ర‌కు ఏపీలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగ‌నుంది. జూన్ 4న ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు న‌రాలు తెగే టెన్ష‌న్ అయితే త‌ప్ప‌దు. అయితే… ఇప్ప‌టికే పందేలు క‌ట్టిన పందెం రాయుళ్లు.. మ‌రింత టెన్ష‌న్ ప‌డుతున్నారు. దూరా భారాల నుంచి కూడా.. ఏపీకి వ‌చ్చి ఓటేసిన వారు నిరంత‌రం .. ఇక్కడ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకుంటున్నారు.

ఇక‌, పోటీలో ఉన్న నాయ‌కుల టెన్ష‌న్ మ‌రో విధంగా ఉంది. వీరిని గెలిపిస్తామంటూ.. కొంద‌రు అభ్య‌ర్థుల బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు. వారు మ‌రింత టెన్ష‌న్‌లో ఉన్నారు. ఎందుకంటే.. అప్ప‌గించిన టాస్క్ పూర్తి చేయ‌క‌పోతే.. వారిమాటేమో కానీ.. వీరికి పార్టీల్లో ప‌ద‌వులు ద‌క్క‌డం క‌ష్టం. పైగా అధినేతల ముందు.. ప‌లుచ‌న అవుతారు. అంతేకాకుండా.. కేడ‌ర్‌లోనూ ప‌ట్టు లేద‌నే వాద‌న వినిపిస్తుంది. దీంతో అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తామంటూ.. ముందుకు వ‌చ్చిన వారు ఇప్పుడు స‌త‌మ‌తం అవుతున్నారు..

మ‌రోవైపు.. ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులకు చాలా చోట్ల ఆ పార్టీ.. ఈపార్టీ అని తేడాలేకుండా.. దాదాపు అన్ని పార్టీల నాయ‌కుల‌కు కూడా..రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టారు. కొంద‌రు నామిన‌ల్ ఇంట్ర‌స్ట్‌కు వడ్డీ కూడా ఇచ్చిన‌ట్టు ప్ర‌చార స‌మ‌యంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు సంబంధించి ఈ నిధుల‌ను అభ్య‌ర్థులు వినియోగించుకున్నారు. ఇక‌, ఈ జాబితాలో కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు కూడా ఉన్నారు. వీరంతా కూడా.. త‌మ త‌మ అభ్య‌ర్థులు గెలుస్తార‌నే పెట్టుబ‌డులు పెట్టారు.

ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న వేడివేరు. అటు వైసీపీ వ‌చ్చేస్తుంద‌ని.. ఇటు కూట‌మి వ‌చ్చే స్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డంతోపాటు.. నాయ‌కులు కూడా ప్ర‌చారాన్ని హోరెత్తించారు. దీంతో పెట్టుబ‌డులు పెట్టేవారు. ఉత్సాహంగా ముందుకు వ‌చ్చి.. త‌మ త‌మ నాయ‌కుల‌కు సొమ్ములు ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా. తీవ్ర టెన్ష‌న్‌తో న‌లిగిపోతున్నారు. ఎందుకంటే.. పోలింగ్ అనంత‌రం.. ప్ర‌జ‌ల‌నాడిని ఎవ‌రూ ప‌ట్టుకోలేక పోతున్నారు. దీంతో వీరంతా కూడా.. టెన్ష‌న్‌తో ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు.