అది కాంగ్రెస్ నిర్ణయమా? రేవంత్ నిర్ణయమా?

తెలంగాణలో కొత్తగా రాష్ట్రప్రభుత్వ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ గీతం నిర్ణయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలను తయారు చేయించారు. అందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు చిహ్నాలు అంటూ వాటిని తొలగిస్తామని ప్రకటించారు.

తాజాగా వాటిని రాష్ట్ర చిహ్నం నుండి తొలగించి కొత్తవి విడుదల చేసే ప్రయత్నాలు తుది దశకు వచ్చాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ బదులు టీజీగా మార్చింది. ఇక జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మారుస్తామని ప్రకటించింది. అయితే జయజయహే తెలంగాణ పాటకు మణిశర్మ సంగీతం అందించడం వివాదానికి దారితీసింది. అయితే అది కవి అందెశ్రీ నిర్ణయం అని తనకు సంబంధం లేదని రేవంత్ తేల్చేశాడు.

ఇవన్నీ పక్కన పెడితే గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం గురించి ప్రజాబాహుల్యంలో ఎక్కడా వ్యతిరేకత గానీ, సమీక్ష కానీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వీటి పట్ల వ్యతిరేకత గానీ, మార్పులు చేర్పులు సూచించడం గానీ పదేళ్ల చరిత్రలో ఎన్నడూ చేయలేదు. ఇక వ్యక్తిగతంగా రేవంత్ కూడా వీటి గురించి మాట్లాడిన దాఖలాలు గానీ, ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చిన ఘటన గానీ, మీడియా ప్రకటన కానీ చేసిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించిన హామీలు లేవు.

ఈ నేపథ్యంలో హఠాత్తుగా వీటిని ముందుకేసుకోవడం వెనక కారణం ఏంటన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరిక చిహ్నాలు అంటున్న రేవంత్ తన మనవడికి మాత్రం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని స్ఫూర్థితో రుద్రదేవ్ అని ఎలా పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయాలు కాంగ్రెస్ కు మేలు చేస్తాయా ? నష్టం చేస్తాయా ? అన్న చర్చ మొదలయింది.