పిన్నెల్లి అరాచ‌కాల‌పై బుక్‌లెట్‌: చ‌రిత్ర‌లో ఫ‌స్ట్!

వైసీపీ ఎమ్మెల్యే, మాచ‌ర్ల శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరాచ‌కాల‌పై బుక్‌లెట్ రూపొందించారు. దీనిని ఎవ‌రు రాశార‌నే విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. ఎందుకంటే.. ప్రాణ భ‌యం ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు రాశార‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌లేదు. అయితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం పీడిఎఫ్ కాపీ జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇలా.. ఒక ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై బుక్‌లెట్ రూపొందించ‌డం.. ప్ర‌చారం చేయ‌డం అనేది చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని పరిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, 23 పేజీలు ఉన్న ఈ బుక్‌లెట్ పూర్తిగా పీడీఎఫ్ కాపీ. ప్రింట్ వెర్ష‌న్ కాదు.

ఈ బుక్‌లెట్‌లో పిన్నెల్లి గ‌త రెండు ద‌శాబ్దాలుగా.. మాచ‌ర్ల‌లో సాగించిన మార‌ణ‌హోమాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు ర‌చ‌యిత‌. రూ.2 ల‌క్ష‌ల ఆస్తి ఉన్న పిన్నెల్లి సోద‌రుల ఆస్తులు రూ.2 వేల కోట్ల‌కు చేరిన వైనాన్ని వివ‌రించారు. అదేవిధంగా దాడులు, దోపిడీలు.. హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాలు వంటి అనేక అంశాల‌ను ఈ బుక్‌లెట్‌లో వివ‌రించారు. ప్ర‌ధానంగా అమాయ‌కుల‌ను వేధించి.. సొత్తును స్వాధీనం చేసుకోవ‌డం.. ఇళ్ల‌ను, భూముల‌ను క‌బ్జా చేసిన వైనాన్ని కూడా వివ‌రించారు. అధికారంలో అను కూల పార్టీ ఉన్నా.. ప్ర‌తిప‌క్షం ఉన్నా.. పిన్నెల్లి సోద‌రులు(రామ‌కృష్ణారెడ్డి-వెంక‌ట్రామిరెడ్డి) రెచ్చిపోయిన తీరును వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో పిన్నెల్లికి అనుకూలంగా కొంద‌రు వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా ర‌చ‌యిత వివ‌రించారు. త‌ద్వారా.. ఇక్క‌డ సాగిన పాశ‌విక పాల‌న‌ను కూడా పేర్కొన్నారు. ఇక‌, పిన్నెల్లి హ‌యాంలో ఒక గ్రామం గ్రామం(రెంట చింత‌ల‌) మొత్తం వ‌ల‌స పోయిన తీరు.. ఇటీవ‌ల ఎన్నిక‌ల సంఘం జోక్యంతో తిరిగి వ‌చ్చిన తీరును స‌మ‌గ్రంగా క‌ళ్ల‌కు క‌ట్టారు. పీఆర్కే ట్యాక్స్ నుంచి ఇసుక‌, మ‌ద్యం, గ్రావెల్ దోపిడీ వ‌ర‌కు అన్నివిష‌యాల‌ను ఈ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా త‌మ‌ను ఎదిరించిన వారిని హ‌త్య చేసిన‌, చేయించిన తీరును కూడా ర‌చ‌యిత పేర్ల‌తో స‌హా వివ‌రించారు. మొత్తంగా ఈ బుక్‌లెట్ పిన్నెల్లి సోద‌రులు సాగించిన దుమారాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది.

కాగా, ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ లో పాల్వాయి గేటు స‌మీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈవీఎం, వీవీప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం.. ఆయ‌న‌పై కేసులు న‌మోదు కావ‌డం.. ఈ విష‌యం తెలిసి ప‌రార‌వ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పిన్నెల్లి బాధితులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వారివేద‌న‌ను పంచుకుంటున్నారు.