జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారులోని సింగ్‌న‌గ‌ర్ ప్రాంతంలో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌నలో ప్ర‌ధాన నిందుతుడు(ఏ1) స‌తీష్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. విజ‌య‌వాడ‌లోని 8వ అద‌న‌పు జిల్లా కోర్టు ఆయ‌నకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌కు సంబంధించి కొన్ని ష‌ర‌తులు విదించింది. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం సింగ్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని.. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ముందు సంత‌కాలు చేయాల‌ని ఆదేశించింది. అదేవిధంగా రూ.50 వేల‌పూచీ క‌త్తు స‌మ‌ర్పించాల‌ని ష‌ర‌తులు విధించింది. కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి ఇంట‌ర్వ్యూలు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కూడ‌ద‌ని.. మాట్లాడ‌రాద‌ని తేల్చి చెప్పింది.

అదేవిధంగా రాజ‌కీయ నేత‌ల‌తోనూ ఈ కేసు విష‌యంపై ఎలాంటి స‌మాచారాన్ని పంచుకోరాద‌ని కోర్టు ష‌రతుల్లో పేర్కొంది. దీంతో స‌తీష్‌కు బెయిల్ ల‌భించింది. కాగా, బెయిల్ మంజూరుకు సంబంధించిన పిటిష‌న్ల‌పై సుమారు వారం రోజుల పాటు.. ఈ కోర్టు విచార‌ణ చేసింది. అనంత‌రం.. తీర్పును మంగ‌ళ‌వారం వెలువ‌రించింది. ఇదిలావుంటే.. ఎన్న‌కల ప్ర‌చారంలో భాగంగా సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్దం బ‌స్సు యాత్ర నిర్వ‌హించారు. క‌డ‌ప‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర ఏప్రిల్ 13న విజ‌య‌వాడ శివారు.. సింగ్‌న‌గ‌ర్‌కు చేరుకుంది. అయితే.. రాత్రి స‌మ‌యంలో ఇక్క‌డ ఆయ‌న రాయిదాడి జ‌రిగింది. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు కంటికి కూడా గాయ‌మైంద‌ని స‌ర్కారు తెలిపింది.

ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం కూడా రేగింది. ప్ర‌తిప‌క్షం టీడీపీ సీఎం జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం చేయించింద‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపించారు. అయితే.. జ‌గ‌న్ కు త‌గిలింది గుల‌క‌రాయి మాత్ర‌మేన‌ని దీనిని రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఈ వివాదం నెల రోజు పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రి వాద‌న వారు వినిపించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పోలీసులు కూడా బ‌దిలీ అయ్యారు. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు చివ‌ర‌కు స‌తీష్ అనే యువ‌కుడి ప్ర‌మేయం ఉంద‌ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. తాజాగా ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది.