రాజ్యాంగం వ‌ర్సెస్ రాజ్యాంగం-బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌!!

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. కీల‌క‌మైన విష‌యం ఒక‌టి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. వ‌రుస‌గా మూడోసారి అదికారంలోకి రావాల‌ని త‌పిస్తున్న బీజేపీ ఒక‌వైపు.. కాదు, ఈ సారైనా గెలిచి.. పార్టీ అస్థిత్వాన్ని నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాయి. రెండు సార్లు వ‌రుస‌గా అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాల‌పై వ్యూహాలు వేస్తూ.. ఎన్నిక‌ల పోరులో తీవ్రంగా శ్ర‌మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఎన్నిక‌ల‌కు ముందు.. భార‌త్ జోడో యాత్ర చేశారు.

ఆ యాత్ర ప్ర‌భావం ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను.. ఎదురుదాడిని త‌ట్టుకోవ‌డం మాత్రం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే.. ఇరు పార్టీల విష‌యంలో స‌హ‌జంగానే పోటీ ఉన్నా.. కీల‌క‌మైన విష‌యాల్లో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు రాజ్యాంగం అంశాన్ని తీసుకుంటే.. బీజేపీ నేత‌లు.. ఏం చెబుతున్నారంటే.. కాంగ్రెస్ కూట‌మి ఇండియా క‌నుక అధికారంలోకి వ‌స్తే.. దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుంద‌ని.. ఎస్సీ ఎస్టీ బీసీల‌కు ఉన్న రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కుల‌ను హ‌రించేస్తుంద‌ని అంటున్నారు.

అంతేకాదు.. ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచేందుకు రాజ్యాంగాన్ని స‌మూలంగా మార్చేసినా ఆశ్చ‌ర్యం లేదని చెబుతున్నారు. ఈ విష‌యాల్లో గ‌ల్లీ నాయ‌కుడు చెబితే .. స‌రేలే..! అని వ‌దిలేయొచ్చు. కానీ.. సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ఈ విష‌యాన్ని చెబుతున్నారు. కూట‌మికి ఓటేస్తే.. ఇక‌, రాజ్యాంగం మారిపోతుంద‌ని అంటున్నారు. క‌ట్ చేస్తే.. కాంగ్రెస్ కూడా.. ఇదే వాద‌న చెబుతోంది. బీజేపీ మూడోసారి వ‌స్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తార‌ని.. దీనిని హిందూత్వ రాజ్యాంగంగా చేస్తార‌ని.. రాజ్యాంగం ఉనికి కూడా లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక్క‌డ‌కూడా.. అగ్ర‌నేత‌లే ఈ ప్ర‌చారం చేస్తున్నారు.

దీంతో అస‌లు రాజ్యాంగంపై వీరు చేస్తున్న ప్ర‌చారం చేసుకుంటున్న విమ‌ర్శ‌లు.. నిజ‌మేనా? ఎంత మెజారిటీ ఉంటే మాత్రం.. రాజ్యాంగాన్ని అడ్డ‌గోలుగా మార్చేయొచ్చా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఈ విష‌యంపై దృష్టి పెడితే.. సుప్రీంకోర్టు.. 1960-70ల మ‌ధ్య సాగిన మిన‌ర్వామిల్స్‌ వ‌ర్సెస్ భార‌త ప్ర‌భుత్వం కేసులో సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. రాజ్యాంగం మౌలిక స్వ‌రూపాన్ని మార్చేందుకు.. ఏ ఒక్క‌రికీ హ‌క్కులేద‌ని తేల్చి చెప్పింది. ఇక్క‌డ మౌలిక స్వ‌రూపం అంటే.. సందేహం రావొచ్చు.. రాజ్యాంగ పీఠిక‌లో పేర్కొన్న లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యం అనే వాక్య‌మే మౌలిక స్వ‌రూపం.

దీనిని ఎంత మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. మార్చేందుకు ఛాన్స్ లేదు. సో.. దీనిని బ‌ట్టి.. రేపు ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. స‌వ‌ర‌ణ‌లు చేయొచ్చేమోకానీ.. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం .. లౌకిక అనే ప‌దం తీసేసే హ‌క్కు లేనేలేదు. అంటే.. ఇవ‌న్నీ.. తెలిసి కూడా.. బీజేపీ-కాంగ్రెస్‌లు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న విమ‌ర్శ‌లు కేవ‌లం.. రాజ‌కీయ ప‌ర‌మే త‌ప్ప‌.. రాజ్యాంగ‌ప‌ర‌మైన‌వి కాద‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంది.