జూన్ 2… ఏపీని అనాధ‌ను చేస్తోందా?

ఈ మాట అనేందుకు ఒకింత ఇబ్బందిగానే ఉన్నా.. త‌ప్ప‌దు. ఎందుకంటే.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జన జ‌రిగి.. జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు నిండుతున్నాయి. దీంతో విభ‌జ‌న ద్వారా ఏర్ప‌డిన తెలంగాణ‌లో అక్క‌డి ప్ర‌జలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇదే స‌మయంలో ఏపీవైపు ఒక్క నాయ‌కుడు కూడా.. ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇక్క‌డ ఎలానూ సంబ‌రాలు చేసుకునేది లేదు. కానీ, ఇక్క‌డ చ‌ర్చ‌కు రావాల్సింది.. విభ‌జ‌న చ‌ట్టం. ఎందుకంటే.. ప‌దేళ్ల త‌ర్వాత‌.. విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌. ఇది అంద‌రికీ తెలిసిందే. ఏపీ, తెలంగాణ‌ల‌కు ఉన్న ఉమ్మ‌డి రాజ‌ధాని జూన్ 2 త‌ర్వాత‌.. కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే రాజ‌ధానిగా మార‌నుంది. మ‌రోవైపు.. ఏపీకి ఇప్ప‌టికీ పూర్తిస్థాయి రాజ‌ధాని అందుబాటులోకి రాలేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రంతో మాట్లాడి.. దీనిని మ‌రో ఐదేళ్లు పొడిగించే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంది. కానీ, ఆ దిశ‌గా ఏపీలో ఉన్న పార్టీలు.. ఇప్ప‌టి వ‌ర‌కు.. స్పందించ‌లేదు. దీంతో ఉమ్మ‌డి రాజ‌ధాని విష‌యంపై ఏపీ చేతులు ఎత్తేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌రో ముఖ్య విష‌యం.. ఆర్టీసీ ఆస్తులు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో ఆర్టీసీ ఆస్తుల‌ను 10 ఏళ్ల‌లోగా ప‌రిష్క‌రించుకోవాలని.. చెప్పారు. ఆ త‌ర్వాత‌.. అని ఎక్క‌డా చెప్ప‌లేదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం అర‌కొర‌తో స‌హా.. మిగిలిన ఆస్తుల‌ను త‌మ సంస్థ‌లు తీసుకునేలా చ‌క్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి భారీ ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం. ఇదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఏపీ భ‌వ‌నాలు.. కార్యాల‌యాలు.

ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి.. సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చారు. కానీ, వీటిని ఏపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ ఆదేశాల సారాంశం.. జూన్ 2 త‌ర్వాత‌.. త‌మ ప‌రిధిలో ఉన్న అన్ని కార్యాల‌యాల‌ను తెలంగాణ‌లో క‌లిపేయాలని లిఖిత పూర్వ‌క ఆదేశాలు.. ఇచ్చారు. అయినా. ఏపీలో ఏ పార్టీ కూడా స్పందించ‌లేదు. మొత్తంగా చూస్తే.. విద్యుత్ బ‌కాయిలు.. 5వేల కోట్లు రావాల్సి ఉంది. వీటిని తెచ్చుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. మ‌రోవైపు ఉద్యోగుల పంపిణీ కూడా.. అలానే ఉంది. మొత్తంగా చూస్తే..జూన్ 2 ఏపీని అనాధ‌ను చేయ‌నుందా? ఎవ‌రూ ప‌ట్టించుకోరా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.