జూన్ 9.. జ‌గ‌న్ కాదు బాబు

జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్న తేదీ ఇది. మ‌రోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, జూన్ 9న జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని, కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక జూన్ 9న చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకునే డేట్ అయితే ఫిక్స్ చేశారు కానీ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాకే తెలుస్తుంది. జూన్ 4న ఆ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డుతుంది. అయితే రాజ‌కీయ విశ్లేష‌కుల అంచనాల ప్ర‌కారం ఈ సారి ఏపీలో కూట‌మిదే అధికార‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కానీ ఈ విష‌యాన్ని వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ పార్టీనే మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని లేనిపోని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తామే రెండో సారి అధికారంలోకి వ‌స్తామ‌ని, జూన్ 9న జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వైవీ సుబ్బారెడ్డి నుంచి ఆ పార్టీ నేత‌లంద‌రి వ‌ర‌కూ అదే మాట‌. కానీ వీళ్లు ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మానాల‌ని టీడీపీ నాయ‌కులు కౌంట‌ర్ ఇస్తున్నారు. జూన్ 9న సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించేది బాబే అని తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు చెప్పారు. వైసీపీ నేత‌ల‌నూ ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తామ‌న్నారు.

మ‌రోవైపు ఇది విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి పోరుగానూ మారింది. జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే విశాఖ నుంచే ప‌రిపాల‌న చేస్తార‌ని వైసీపీ చెబుతోంది. ఇప్ప‌టికే అక్క‌డి రుషికొండ‌పై కార్యాల‌యాలు సిద్ధం అవుతున్నాయి. మ‌రోవైపు బాబు సీఎం అయితే మాత్రం అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించే అవ‌కాశం ఉంది. మ‌రి ఎవ‌రిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.