రంగంలోకి రేవంత్‌.. ఇక వార్ వ‌న్‌సైడ్‌!

ఆశ‌లు లేని స్థితి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేసి అధికారంలో తేవ‌డంలో రేవంత్ రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డంలోనూ ఆయ‌న ప్ర‌త్యేక ముద్ర వేస్తున్నారు.

తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించేలా రేవంత్ ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఇప్పుడు దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటూ పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేస్తున్నారు.

తాజాగా వ‌రంగల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఈ స్థానాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే లక్ష్యంగా రేవంత్ బ‌రిలో దిగారు.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్ బ‌రిలో దిగారు. ఇక ఈ సిటింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా క‌ష్ట‌ప‌డుతోంది.

కేటీఆర్ ఇక్క‌డ త‌మ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి విజ‌యం కోసం తీరిక లేకుండా శ్ర‌మిస్తున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూసుకుంటే కాంగ్రెస్‌కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగ‌డం కాంగ్రెస్ నాయ‌కుల‌కు మ‌రింత ఉత్సాహాన్నిచ్చేదే.

ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఫోక‌స్ పెట్టిన రేవంత్ తాజాగా జూమ్ స‌మావేశం నిర్వ‌హించారు. త‌మ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న‌, మూడు ఉమ్మ‌డి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్ల‌మెంట్ ఇంఛార్జీలు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీలు, కో ఆర్డినేట‌ర్ల‌తో రేవంత్ మాట్లాడారు. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను గెలిపించేందుకు క‌ష్ట‌ప‌డాల‌ని దిశానిర్దేశం చేశారు. మే 27న జ‌రిగే పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థికే ఓట్లు ప‌డేలా చూడాల‌న్నారు.

2021లో ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన మ‌ల్ల‌న్న. . బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ త‌ర‌పున బ‌రిలో దిగుతున్న ఆయ‌న క‌చ్చితంగా విజ‌యం సాధించేలా క‌నిపిస్తున్నార‌నే టాక్ ఉంది.