ఐదో విడత : ఆ రెండే హాట్ సీట్లు !

దేశం వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. ఐదో విడత పోలింగ్ ఈ రోజు జరుగుతుంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ విడతలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏడు, బిహార్ లో ఐదు, ఒడిశా ఐదు, ఝార్ఖండ్ రాష్ట్రంలో మూడు, జమ్మూకశ్మీర్ లో ఒకటి, లద్దాఖ్ లో ఒక స్థానంకు పోలింగ్ జరుగుతుంది. ఐదో విడతతో దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకుగాను 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తవుతుంది.

అయితే ప్రస్తుతం అందరిదృష్టి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ లోక్ సభ స్థానాల మీదనే ఉంది. ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఐదేళ్ల క్రితం ఈ కోటను బద్దలు చేస్తూ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పోటీచేసి అమేథీలో రాహుల్ గాంధీపై విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీలో స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగింది. ఆమె మీద గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపింది.

ఇప్పటి వరకు రాయ్ బరేలీ నుంచి వరసగా విజయం సాధిస్తూ వస్తున్న సోనియాగాంధీ ఈ సారి రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అందుకే ఈ రెండు స్థానాల్లో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయా ? అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ విడతలో వీరితో పాటు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఉజ్వల్ నికమ్, కరణ్ భూషణ్ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత రోణి ఆచార్య వంటి ప్రముఖ నేతలు పోటీలో ఉండడం గమనార్హం.