ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటా చేజిక్కించికుంటుందా ?

వివాదాస్పదమైన ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా అటుతిరిగి ఇటు తిరిగి మళ్ళీ టాటాల చేతికే చిక్కేట్టుంది. దేశంలో అసలు తొలి విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్ ప్రారంభించిందే టాటా కంసెనీ అన్న విషయ అందరికీ తెలిసిందే. 1932లో జేఆర్డీ టాటా దేశంలో తొలి విమానయాన సంస్ధను ప్రారంభించటమే కాకుండా తొలి విమానాన్ని నడిపిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అటువంటి విమానయాన సంస్ధను ప్రభుత్వం టేకెన్ ఓవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియాగా మారిపోయింది. టాటాల చేతిలో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా నడిచిన విమాన సంస్ధ ఎప్పుడైతే ప్రభుత్వం చేతిలోకి మారిందో సమస్యలు మొదలయ్యాయి.

ప్రభుత్వం చేతికి మారిన తర్వాత కొత్తల్లో టాటాల భాగస్వామ్యంతో నడిచినా తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. అలాంటి సంస్ధలో సమస్యలు పెరిగిపోతు చివరకు ఇపుడు మూతపడే దశకు చేరుకున్నది. సంస్ధ రూ. 85 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నష్టాల్లో సంస్ధను నడపలేక, సిబ్బందికి జీతబత్యాలు చెల్లించలేక, లాభాల్లోకి తీసుకొచ్చే మార్గాలు కనబడకపోవటంతోనే చివరకు అమ్మేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

విచిత్రమేమంటే ఎయిర్ ఇండియాను అమ్మేయాలని గడచిన రెండేళ్ళుగా కేంద్రం ఎంత ప్రయత్నిస్తున్నా కొనటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు కూడా ఎందుకు ఆసక్తి చూపటం లేదంటే సమస్యలన్ని ఉన్నాయట. ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, సిబ్బంది బాధ్యతా రాహిత్యం తదితరాల వల్లే ఎయిర్ ఇండియా తీరని నష్టాల్లోకి కూరుకుపోయినట్లు సమాచారం. నష్టాల్లో నుండి సంస్ధను బయటపడేసేందుకు 2011-12లో ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయించినా నష్టాలు తగ్గకపోగా అభివృద్ధిలో ఎటువంటి పురోగతి కనబడకపోవటమే విచిత్రం.

అమ్మకానికి సంబంధించి కేంద్రం గతంలో విధించిన కొన్ని షరతులను తొలగించటం, కొనుగోలు చేసే సంస్ధకు అనుకూలంగా కొన్ని నిబంధనలను మార్చిన కారణంగా కొన్ని సంస్ధలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయట. హిందుజాగ్రూపు, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహాద్, సింగపూర్ ఎయిర్ లైన్స్, టాటా గ్రూపులు టెండర్లు దాఖలు చేశాయట. సంస్దను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే అప్పుల భారాన్ని కేంద్రప్రభుత్వం కూడా కొంత మోస్తుందన్న హామీ కారణంగానే పై సంస్ధలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్ధ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కున్న మొత్తం రూ. 60 వేల కోట్ల అప్పుల్లో కొనుగోలు చేయబోయే సంస్ధ రూ. 23 వేల కోట్ల భారాన్ని మోస్తే చాలు. మిగిలిందాన్ని కేంద్రమే భరిస్తుందట. అలాగే ప్రస్తుతం సంస్ధలో ఉన్న 9430 శాశ్వత ఉద్యోగులను కూడా వీలైనంతమందిని తగ్గించే ప్రయత్నాలు మొదలైయ్యాయి. ఇటువంటి అనేక వెసులుబాట్లను తాజాగా ఇవ్వటం వల్లే పై నాలుగు సంస్ధలన్నా కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయట. మొత్తానికి పరిణామాలన్నీ సానుకూలమైతే ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా గ్రూపు చేతిలో పడటం ఖాయమని అనుకుంటున్నారు.