పోటెత్తిన ఓట‌రు 81.6 శాతం ఓటింగ్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌?

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు సాగింది. ఇది నిర్ణీత స‌మ‌యం క‌న్నా 1గంట ఎక్కువ‌. ఇక‌, ఇత‌ర 47 పోలింగ్ బూతుల్లో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, 34 చోట్ల రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు కూడా జ‌రిగింది. దీంతో పోలింగ్ శాతం 70 అనుకున్న‌ది కూడా.. ఏకంగా 81.60 శాతానికి చేరింది. ఇదే విష‌యాన్ని అధికారికంగా కూడా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

ఈ త‌ర‌హా ఓట్లు రాల‌డం, రావ‌డం అనేది రాష్ట్ర ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇంత భారీగా పెరిగిన ఓటు బ్యాంకు ఎవ‌రికి అనుకూలంగా మారుతుంద‌నేది చ‌ర్చ‌నీయాంశం అయితే. దీనిపై వైసీపీ , టీడీపీ కూట‌మి ప‌క్షాలు ఎవ‌రి వాద‌న వారే వినిపిస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని కూట‌మి ప‌క్షాలు భావిస్తున్నాయి. అలాగ‌ని బ‌య‌ట‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే.. గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ చేసిన సంక్షేమం.. దీనికి అడుత‌గులుతోంది.

పోనీ… వైసీపీ చెబుతున్న మేర‌కు ప్ర‌భుత్వ సానుకూల‌తే ఓటు రూపంలో రాలింద‌ని అంటున్నారు. వారు కూడా.. దీనిని బ‌లంగా ప్రొజెక్టు చేసుకోలేక పోతున్నారు. మొత్తంగా చూస్తే.. ఓటు బ్యాంకు పెరిగింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అయితే.. కూట‌మికి అనుకూల‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీకి ప్ల‌స్ అని అంటున్నారు. అయితే.. ఎటు ప‌డినా.. భారీ ఓటు బ్యాంకు కావ‌డంతో ఎలాంటి ప‌రిస్థితి వ‌స్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ఒక‌వేళ‌.. ఎవ‌రు గెలిచినా… ప‌ది సీట్ల మెజారిటీతో గెలిచే అవ‌కాశం ఉంద‌ని మ‌రో అంచ‌నాగా ఉంది. మొత్తానికి 1957తో పోల్చుకుంటే.. ఎన్న‌డూ లేని విధంగా ఓట‌రు చైత‌న్యం అయితే క‌నిపించింది. అమ‌రావ‌తి రాజ‌దాని కోసం కావొచ్చు.. లేదా.. వైసీపీ ఇచ్చిన సంక్షేమం కావొచ్చు.. చంద్ర‌బాబును జైలు పంపార‌న్న క‌సి కావొచ్చు.. ఇవ‌న్నీ కాకుండా.. ఉద్యోగ‌, ఉపాధి అంశాలు కావొచ్చు.. ఎలా చూసుకున్నా.. ఫ్యాక్ట‌ర్ ఏదైనా.. ఓట‌రు నాడికోసం వేచి చూడాల్సిందే.