భార్యతో పిఠాపురానికి పవన్?

జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఐతే అంతటితో ఆగకుండా ఈ మధ్య పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అని తెలిసినా.. నాలుగో పెళ్లి కూడా జరిగినట్లు మాట్లాడేస్తుంటారు. నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్ అంటూ పవన్ కౌంటర్ ఇచ్చినా కూడా జగన్ అండ్ కో తీరు మారట్లేదు.

ఇదిలా ఉంటే.. పవన్ మూడో పెళ్లి కూడా పెటాకులైందనే ప్రచారాన్ని ఈ మధ్య వైసీపీ నాయకులు చేస్తున్నారు. జనసేన నుంచి వైసీపీలో చేరిన విజయవాడ నేత పోతిన మహేష్.. పిఠాపురంలో గృహప్రవేశానికి అనా లెజ్‌నెవాను తీసుకురాగలవా అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

ఈ కామెంట్‌ను బట్టి అనా కూడా పవన్‌కు దూరమైందనే ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. ఐతే ఈ వ్యాఖ్యానాల నేపథ్యంలో సమాధానం చెప్పాలని అనుకున్నాడో ఏమో కానీ.. పవన్ తన భార్యతో కలిసి తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి రావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్‌కు మంగళగిరి నియోజకవర్గంలో ఓటు ఉండగా.. ఎన్నికల రోజు ఉదయం అక్కడ ఓటు వేసి తర్వాత భార్యతో కలిసి పిఠాపురానికి చేరుకోనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ ఆ పనే చేస్తే పోతిన మహేష్ సహా వైసీపీ నేతలందరికీ చెంపపెట్టులాంటి సమాధానం చెప్పినట్లు అవుతుంది. పిఠాపురంలో వంగా గీత మీద పోటీ చేస్తున్న పవన్‌.. అక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని స్థానిక వర్గాలు అంటున్నాయి.