మీడియా ముందే వ‌ల‌వ‌లా ఏడ్చేసిన ష‌ర్మిల..

మీడియా ముందే నాయ‌కులు వ‌ల‌వ‌లా ఏడ్చేయ‌డం కొత్త కాదు. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. త‌న స‌తీమ‌ణిని దూషించారంటూ.. మీడియా ముందు క‌న్నీరు పెట్టుకున్నారు. వెక్కివెక్కి ఏడ్చారు. త‌ర్వాత‌.. మంత్రి రోజా కూడా త‌న‌ను వైసీపీ మంత్రులే టార్గెట్ చేస్తున్నారంటూ మీడియా ముందు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల కూడా.. గ‌తంలో ఒక‌సారి మీడియా ముందు ఏడ్చేశారు. తాను నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని.. ఏ ప్యాకేజీ అందుకోలేద‌ని ఆమె అప్ప‌ట్లో చెప్పారు.

ఇక‌, తాజాగా కూడా మ‌రోసారి వైఎస్ ష‌ర్మిల మీడియా ముందు వ‌ల‌వ‌లా ఏడ్చేశారు. దీనికి కార‌ణం సొంత అన్న‌, ఏపీసీఎం త‌న‌ను త‌ప్పుబ‌ట్ట‌డ‌మేన‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల ఓమీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సీఎం జ‌గ‌న్‌.. ష‌ర్మిల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆమె రాజ‌కీయ కాంక్ష వ‌ల్లే కుటుంబంలో త‌గాదాలు వ‌చ్చాయ‌ని.. లేక‌పోతే అంతాబాగానే ఉండేద‌ని అన్నారు. ఈ పాయింట్‌పై నే ష‌ర్మిల శుక్ర‌వారం మీడియా ముందు వ‌ల‌వ‌లా ఏడ్చేశారు. అంత మాట అంటావా? అంటూ.. ఆమె క‌న్నీరు పెట్టుకున్నారు.

అంతేకాదు.. త‌న‌కు రాజ‌కీయ కాంక్ష ఉంటే.. జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడే.. తాను వైసీపీని హ‌స్త‌గ‌తం చేసుకుని అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టించుకునే దాన్న‌ని చెప్పారు. కానీ, పార్టీ కోసం 3 వేల కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసిన విష‌యాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయాడ‌ని అన్నారు. జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు పాద‌యాత్ర‌, 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన‌ప్పుడు.. ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌మ‌ని అడిగింది జ‌గ‌న్ కాదా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేయించింది జ‌గ‌నేన‌న్నారు.

సీఎం జ‌గ‌న్‌ను ఏనాడూ రూపాయి కూడా అడ‌గ‌లేద‌ని ష‌ర్మిల చెప్పారు. కానీ, తాను డ‌బ్బులు అడిగిన‌ట్టుగా జ‌గ‌న్ చెబుతున్నార‌ని ఇది చాలా ఘోర‌మ‌ని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజ‌కీయాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌న్న జ‌గ‌న్‌.. సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బంధువులు కాదా.. ? వారిని పార్టీలో ఎలా పెట్టుకున్నార‌ని ష‌ర్మిల నిలదీశారు.

బైబిల్‌పై ప్ర‌మాణం చేస్తావా?

“బైబిల్‌ ఒట్టేసి చెబుతున్నా. నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదు. జ‌గ‌న్‌ను ఎప్పుడూ పదవులు అడగలేదు. దీనిపై బైబిల్‌ పై ప్రమాణం చేస్తా. మ‌రి నువ్వు చేస్తావా?” అని జ‌గ‌న్‌కు ష‌ర్మిల స‌వాల్ విసిరారు.