తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

కరోనాతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

నెల్లూరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్… 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నికయ్యారు. గతంలో ఆయన నాలుగు సార్లు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు ఉంది. సీనియర్ నాయకుడు అయిన బల్లి దుర్గాప్రసాద్ గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు.

1985లో రాజకీయ ప్రవేశం చేసిన దుర్గాప్రసాద్ పిన్న వయసులో 28 సంవత్సరాలకే శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడంతో జగన్ తిరుపతి లోక్ సభకు నిలబెట్టారు. స్థానికేతరుడు అయినా కూడా 2 లక్ష్లలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు దుర్గాప్రసాద్. ఎంపీగా ఎన్నికైనా 15 నెలల్లో ఆయన కాలం చేశారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ వార్త చిత్తూరు రాజకీయాలకే కాదు, ఏపీ లోనే షాకింగ్.

ఏపీలో పదవిలో ఉండి కోవిడ్ తో మృతి చెందిన తొలి నాయకుడు దుర్గాప్రసాద్. కోవిడ్ మరణం కావడంతో ప్రభుత్వం ఈయన అంత్యక్రియలను ఎలా ఏర్పాటుచేయనుందన్నది ఇపుడు ఇక కీలక ప్రశ్నగా మారింది.