జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ పార్టీకార్య‌క‌ర్త‌ల‌ను వేధించినా.. పోలీసులు స‌హా ఇత‌ర అధికారుల‌ను కూడా వ‌దిలి పెట్టేదిలేద‌ని ఆయ‌న వార్నింగులు ఇస్తున్నారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌ప్త‌స‌ముద్రాల ఆవల ఉన్నా.. వారిని తీసుకువ‌చ్చి కోర్టులో నిల‌బెడ‌తామ‌ని, చ‌ట్టం ప్ర‌కారం శిక్షిస్తామ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపినా.. జ‌గ‌న్ మాత్రం త‌న బాణీని, వాణీని కొన‌సాగిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే బాట‌లో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయ‌న అధికారులు, పోలీసుల‌ను గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. త‌మ పార్టీ నాయ‌కుల‌పై పోలీసులు అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని, త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను కొడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి అధికారుల‌ను వ‌దిలి పెట్టేది లేద‌ని స‌ప్త స‌ముద్రాలు దాటి వెళ్లినా వెన‌క్కి తీసుకువ‌చ్చి శిక్షిస్తామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. రిటైరైనప్ప‌టికీ మేం వ‌చ్చాక మిమ్మ‌ల్ని వ‌ద‌లం. అని ఆయ‌న వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

క్షేత్ర‌స్థాయిలో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై పోలీసులు కేసులు పెడుతున్నారు. దీంతో కొంద‌రు బ‌య‌టకు రావ‌డం లేదు. మ‌రికొంద‌రు త‌మ ప‌నుల్లో తాము ఉన్నారు. ఫ‌లితంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌ర్ ప్ర‌క్రియ‌లో కార్య‌క‌ర్త‌లు పాల్గొన‌డం లేద‌ని కేటీఆర్ చెబుతున్నారు. తాజాగా వారికి అండ‌గా ఉండేందుకు తాము సిద్ధ‌మేన‌ని.. కార్య‌క‌ర్త‌లు ధైర్యం కోల్పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చెప్పారు. స‌ర్ ప్ర‌క్రియ‌లో పాల్గొనాల‌ని కేటీఆర్ సూచించారు. ఈ స‌మ‌యంలోనే కార్య‌క‌ర్త‌లు, క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌పై కేసులు పెడుతున్న పోలీసుల‌కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో అధికార పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌ను కూడా కేటీఆర్ హెచ్చ‌రించారు. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు కోసం కొందరు అధికారులతో నేత‌లు చేతులు క‌లిపి బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి వారిని కూడా తాము వ‌ద‌ల‌బోమ‌ని చెప్పారు. ఏదైనా ఉంటే రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం. మీరు అలా చేయ‌డం లేదు. దొడ్డిదారిలో అధికారుల‌ను వినియోగించి మా కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. ఇలా చేసేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ నాయకులను క్షోభ పెడితే వదిలిపెట్టబోమ‌ని తేల్చి చెప్పారు. నేను కేసీఆర్‌లా మంచోడిని కాదు అని వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.