రేవంత్ ఫస్ట్ ప్రయారిటీ ఆ నియోజకవర్గాలే

ఎక్క‌డ ఓటమి ఎదురైందో అక్క‌డే విజ‌యం సాధించి చూపాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. రాజ‌కీయాల్లోనూ ఇది వ‌ర్తిస్తోంది. ఇప్పుడు తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే చేస్తోందనే చెప్పాలి. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచి అధిష్ఠానానికి బ‌హుమ‌తిగా ఇవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ 14 స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా సాగుతున్నారు. మిగ‌తా సీనియ‌ర్ నాయ‌కులూ త‌మ వంతు కృషి చేస్తున్నారు. కానీ 14 స్థానాల్లో గెలుపంటే అంత సులువు కాదు. అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు ఓడిన చోట కాంగ్రెస్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది.

గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. కానీ 54 చోట్ల ఓడిపోయింది. 54 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఓట‌మి పాల‌య్యారు. ఇప్పుడు తెలంగాణ‌లోని మెజారిటీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధి ఈ అసెంబ్లీ స్థానాలున్నాయి. అందుకే ఓట‌మి పాలైన చోట తిరిగి పుంజుకోవ‌డానికి కాంగ్రెస్ ప్రత్యేక‌మైన వ్యూహాల‌తో సాగుతోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్ గ్యారెంటీల‌ను ప్ర‌తి ఇంటికీ చేరేలా నాయ‌కులు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి నాయ‌కుల‌ను చేర్చుకుంటూ ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌కొట్ట‌డంతో పాటు త‌మ పార్టీని బ‌లోపేతం చేస్తున్నారు.

మ‌రోవైపు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రావ‌డ‌మే ల‌క్ష్యంగా కార్య‌క‌ర్త‌ల్లో రేవంత్ జోష్ నింపుతున్నారు. ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఎక్క‌డ ప్ర‌సంగించినా కార్య‌క‌ర్త‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ, వాళ్ల ర‌క్తం మ‌రిగేలా మాస్ స్పీచ్ ఇస్తున్నారు. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లుంటాయ‌ని రేవంత్ వెల్ల‌డించారు. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు ప‌డేలా క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని పేర్కొన్నారు. అలాగే ఇందిర‌మ్మ క‌మిటీల్లోనూ ప్ర‌యారిటీ ఇస్తామ‌ని చెప్పారు. దీంతో పార్టీ కోసం కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఉత్త‌మంగా ప‌నిచేసేలా రేవంత్ చూస్తున్నారు.