శిరోముండ‌నం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్‌!

ద‌ళిత యువ‌కుల‌కు శిరోముండ‌నం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుతం మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కింద‌టి ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వ‌చ్చింది. విశాఖ ప‌ట్నంలోని అట్రాసిటీ కేసుల విచార‌ణ కోర్టు.. దీనిలో దోషులుగా తేలిన 9 మందికి 18 నెల‌ల జైలు, రూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే.

వీరిలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే.. ఈ కేసులో తుదితీర్పు వెలువ‌డిన త‌ర్వాత‌.. త్రిమూర్తులు స‌హా.. దోషులు అంద‌రూ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పు ను నిలుపుద‌ల చేయాల‌ని కోరారు. దీనిని విచార‌ణకు స్వీక‌రించిన రాష్ట్ర హైకోర్టు.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. అయితే.. లోతైన విచార‌ణ జ‌ర‌పాలన్న అభ్య‌ర్థ‌న‌ను మాత్రం ప‌రిశీలిస్తామ‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలో ఈ కేసుకు సంబంధించి ప్ర‌తివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. మే 1వ తారీకు వ‌ర‌కు కేసు విచార‌ణ‌ను వాయిదా వేసింది. అయితే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఈ ప‌రిణామం.. తోట త్రిమూర్తులుకే కాకుండా.. వైసీపీకి కూడా ఇబ్బందిగా మారింది. తోట త్రిమూర్తులు నామినేష‌న్ క‌నుక తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే.. మండ‌పేట నుంచి ఎవ‌రిని బ‌రిలో నిలపాల‌నేది ప్ర‌శ్న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీ ముఖ్యులు న్యాయ నిపుణుల స‌ల‌హాలు తీసుకుంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.