అన్న‌య్య అండ‌.. కూట‌మికి కొండంత బ‌లం

జ‌గ‌న్ అరాచ‌క పాల‌న నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విముక్తి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా, ఏపీ అభివృద్ధే అజెండాగా తాము కూట‌మిగా ఏర్ప‌డ్డామ‌ని జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ చెబుతున్నాయి. ఈ సారి ఏపీలో కూట‌మిదే అధికారం అని ధీమాతో ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ఈ మూడు పార్టీలు మ‌రింత సంతోషంలో మునిగిపోతున్నాయి. ప‌ద్మ‌భూష‌ణ్ చిరంజీవి లాంటి వ్య‌క్తి అండ‌గా నిలిస్తే అంత‌కంటే కావాల్సింది ఇంకేం ఉంటుంద‌ని అంతా అనుకుంటున్నారు.

ప్ర‌జారాజ్యంతో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి, ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో రాజ‌కీయాల‌కు చిరంజీవి గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటూ ఆయ‌న పొలిటిక‌ల్ స్టేజీకి దూర‌మ‌య్యారు. కానీ ఇప్పుడు కూట‌మి విజ‌యం కోసం మ‌ళ్లీ చిరంజీవి రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌న‌లాంటి వాళ్ల‌కు రాజ‌కీయాలు అచ్చిరావ‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. ఇప్పుడు కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ మేర‌కు త‌న‌ను క‌లిసిన సీఎం ర‌మేశ్‌, పంచ‌క‌ర్ల ర‌మేశ్‌ల‌తో చిరంజీవి ఓ వీడియో విడుద‌ల చేశారు. ఏపీకి మంచి చేసేందుకు మూడు పార్టీలు ముందుకు రావ‌డం మంచి ప‌రిణామం అని పేర్కొన్నారు. ”త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చంద్ర‌బాబు,  బీజేపీ నాయ‌క‌త్వం ఒక కూట‌మిగా రావ‌డం మంచి ప‌రిణామం. అలాగే సీఎం ర‌మేశ్‌, పంచ‌క‌ర్ల ర‌మేశ్ లు మంచి వ్య‌క్తులు. వారిని గెలిపించండి” అని చిరు ఎక్స్‌లోనూ పోస్టు చేశారు.

ఇటీవ‌ల జ‌న‌సేన‌కు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి త‌మ్ముడు ప‌వ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డ్డ అన్న‌య్య‌.. ఇప్పుడు కూట‌మికి మ‌ద్దతు ప‌లక‌డం విశేషం.  ఇప్ప‌టికే కూట‌మి నేత‌లు చిరంజీవి ఆశీర్వాదం కోసం క్యూ క‌డుతున్నారు. ఇక‌పై ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. కూట‌మికి మ‌ద్ద‌తుగా చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అభిమానుల‌పై, ప్ర‌జ‌ల‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా ఇండ‌స్ట్రీని ఇబ్బంది పెట్టిన జ‌గ‌న్‌పై సినిమా కుటుంబం పూర్తి వ్య‌తిరేకంగా ఉంద‌నే చెప్పాలి. అందుకే జ‌గ‌న్ ప‌క్క‌న సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్ద‌గా నిల‌బ‌డ‌టం లేదు. ఇక ఇప్పుడు సినిమా రంగానికి పెద్ద దిక్కులాంటి చిరంజీవి కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం జ‌గ‌న్‌కు దెబ్బే అని అంటున్నారు.