ఆ రెండూ స్థానాలు రేవంత్ కు సవాలే !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండే భిన్న పరిస్థితులు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నా రేవంత్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో కనీసం 10కి తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉండగా, రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి, సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలిచి తీరాల్సిన బాధ్యత తన మీద ఉన్నది. అందుకే రేవంత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

మల్కాజ్ గిరి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిల ముందు కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి తేలిపోతున్నారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ, బీఅర్ఎస్ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీలో చేరిన వారే తప్ప అక్కడ సొంతంగా కాంగ్రెస్ తరపున గెలిచిన కార్పోరేటర్లు గానీ, ఎమ్మెల్యేలు గానీ లేకపోవడం గమనార్హం. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉండి మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్ గిరిలో గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం 10,919 ఓట్లతో విజయం సాధించాడు. ఆ ఎన్నికల్లో రేవంత్ కు 603748 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 592829 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కు ఈ స్థానం నుండి గెలుపు ప్రతిష్టాత్మకం.

రేవంత్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నది. అక్కడి నుండి కాంగ్రెస్ తరపున రాహుల్ సన్నిహితుడు వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుండి మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుండి కాంగ్రెస్ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఅర్ఎస్ అభ్యర్థి 411402 ఓట్లు సాధించి 75 వేల పైచిలుకు ఓట్లతో డీకే అరుణపై విజయం సాధించారు. గతంలోనూ ఇక్కడి నుండే పోటీ చేసిన వంశీచంద్ రెడ్డికి 193631 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏడుగురు కాంగ్రెస్ వారే ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావం చూపగలుగుతారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక వీటితో పాటు రేవంత్ సొంత ఊరు ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం కూడా గెలవాల్సిన సీటే. అక్కడ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో గట్టిపోటీ ఎదురవుతున్నది. రేవంత్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడో వేచిచూడాలి.